రూ.500 కోట్లతో మానుకోట అభివృద్ధి
ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్
మహబూబాబాద్, మే 29 (విజయక్రాంతి): మహబూబాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటివరకు 500 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించిందని, ఆ నిధులతో మానుకోట సమగ్ర అభివృద్ధికి బాటలు వేస్తున్నామని, గత ప్రభుత్వం మాదిరిగా కేవలం ప్రకటనలకు పరిమితం కాకుండా, సంక్షేమం, అభివృద్ధిలో మానుకోటను ముందుండే విధంగా తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ అన్నారు.
శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ లబ్ధిదారులకు నగదు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చుకుంటూ, ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ, ముందుకు సాగుతుందని తెలిపారు. ఇచ్చిన మాటను ఎక్కడ కూడా తప్పకుండా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.






