28 March, 2026 | 2:32 AM

సీతారాముల ఆశీస్సులు నగర ప్రజలందరిపై ఉండాలి

28-03-2026 12:00 AM

మేయర్ కొలగాని శ్రీనివాస్ 

కొత్తపల్లి, మార్చి 27 (విజయక్రాంతి): శ్రీరామ నవమి సందర్భంగా కరీంనగర్ నగర వ్యాప్తంగా శుక్రవారం రోజు  పలు ఆలయాల్లో  సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పలు హనుమాన్ దేవాలయాలు, రామాలయాల్లో జరిగిన  సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకల్లో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, సీపీ గౌస్ ఆలం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రధానంగా తీగలగుట్ట పల్లి కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, సీపీ గౌస్ ఆలం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

మేయర్ కొలగాని శ్రీనివాస్ సీతారాములకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. అనంతరం అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా సీతారాముల కళ్యాణంను నిర్వహించారు. సీతారాముల కళ్యాణంలో మేయర్ కొలగాని శ్రీనివాస్ స్వామీ వారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు తన చేతుల మీదుగా అన్నదాన వితరణ చేశారు. ముఖ్య అతిథిగా హాజరై మేయర్ కొలగాని శ్రీనివాస్ కు కోదండరామాలయ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించారు.

వేద పండితులు వేద మంత్రోచ్చరణల మద్య ఆశీర్వచనం అందించారు. మరో వైపు నగరంలోని దుర్షేడ్, బొమ్మకల్, లక్ష్మీనగర్, రామచంద్రాపూర్ కాలనీ, గోదాంగడ్డ, మార్వాడి దేవాలయం, తదితర ప్రాంతాల్లో హనుమాన్ దేవాలయాలు, రామాలయాల్లో కూడ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. సంబంధిత ఆలయాలను మేయర్ సందర్శించి...సీతారాముల కళ్యాణాన్ని తిలకించి స్వామీ వారికి ప్రత్యేక పూజలు చేశారు. నగర వ్యాప్తంగా పలు ఆలయాల్లో జరిగిన సీతారాముల కళ్యాణ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామీ వారి కళ్యాణంను తిలకించి...మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా మేయర్  మాట్లాడుతూ...కోదండ రాముని ఆశీస్సులు నగర ప్రజలందరి పై ఉండాలన్నారు. నగర ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. నగర ప్రజల పై శ్రీరాముడి కృపా కటాక్షాలు ఎల్లపుడూ ఉండి వారికి ఆయురారోగ్యాలు... సుఖ సంతోషాలను ప్రసాదించాలని వేడుకున్నట్లు తెలిపారు. నగరపాలక సంస్థ నూతన పాలకవర్గం లో ప్రజలకు మెరుగైన సేవలు లభించేలా మా పాలకవర్గానికి శక్తిని ప్రసాదించాలని వేడుకున్నట్లు తెలిపారు. కేంద్ర  హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో మా పాలకవర్గం ప్రజలకు మెరుగైన సేవలందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాదవేణి లావణ్య, భూపతి రవీందర్, మేకల వెంకటేష్, చొప్పరి జయశ్రీ వేణు, దేవసాని సరస్వతి, చొప్పరి జయశ్రీ వేణు మరియు పలువురు కార్పోరేటర్లు, భక్తులు పాల్గొన్నారు.