calender_icon.png 24 November, 2025 | 1:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నత్త కూడా ఆత్మహత్య చేసుకుంటుందేమో!?

24-11-2025 12:57:02 AM

-టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణ పనులపై మాజీ మంత్రి హరీశ్ ఎద్దేవా

-టిమ్స్ ప్రారంభిస్తున్నారా.. మరో తేదీ ప్రకటిస్తారా?

-కోతల సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్

-రెండేళ్లుగా డేట్లు.. డెడ్‌లైన్లు మార్చడం తప్ప చేసిందేమిటీ?

-భూములు తెగనమ్మడంలో ఉన్న శ్రద్ధ వైద్య సేవలందించడంలో ఏదీ ?

-కక్షసాధింపు చర్యలు మానుకుని ఆస్పత్రులను పూర్తి చేయాలని సూచన

హైదరాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి) : టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణ పనుల విషయంలో ప్రభుత్వ తీరు చూస్తుంటే నత్త కూడా ఆత్మహత్య చేసుకుంటుందేమో అని బీఆర్‌ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు.

హైదరాబాద్‌లోని  సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీ నగర్ టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణ పనులను నెల రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు వైద్య సేవలు అందిస్తామని కోతల సీఎం చెప్పి సరిగ్గా నెల రోజులవుతుందని.. టిమ్స్‌ను ప్రారంభిస్తారా.. మరో తేదీ ప్రకటిస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో గప్పాలు కొట్టడం తప్ప, టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవడానికి మీరు చేస్తున్న కృషి శూన్యమని మండిపడ్డారు. టిమ్స్ ఆసుపత్రుల ప్రారంభంపై రెండేళ్లుగా డేట్లు, డెడ్ లైన్లు మార్చడం తప్ప మీరు చేస్తున్నదేం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వ తీరు చూస్తే తనికెళ్ల భరణి చెప్పే కవిత్వం లాగా చెల్లికి పెళ్లి.. జరగాలి మళ్లీ.. మళ్లీ అన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ భూములను తెగనమ్మడంపై ఉన్న శ్రద్ధ, ప్రజలకు వైద్య సేవలు అందించే ఆసుపత్రుల మీద లేకపోవడం సిగ్గుచేటు అని విమర్శించారు.  సీఎం రేవంత్‌రెడ్డి సహా, కాంగ్రెస్ మంత్రుల మాటలు కోటలు దాటితే, ఆచరణ గడప కూడా దాటదు అని చెప్పడానికి నగరానికి నలువైపులా పూర్తి కాకుండా ఉన్న టిమ్స్ ఆస్పత్రులే నిదర్శనమని పేర్కొన్నారు.

ప్రజల జీవితాలతో చెలగాటం తగదు

ఆసుపత్రుల నిర్మాణాలు పూర్తి చేయకుండా, పేదలకు వైద్యం అందించకుండా క్రిమినల్ నెగ్లిజెన్స్‌కు పాల్పడుతున్నది ఈ దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వమని విమర్శించారు. కరోనా తర్వాత వందేళ్ల ముందు చూపుతో కేసీఆర్ హైదరాబాద్ నలువైపులా టిమ్స్ ఆసుపత్రులకు రూపకల్పన చేశారని, ఏప్రిల్ 26, 2022 నాడు దేశ చరిత్రలోనే ఒకే రోజు మూడు ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులకు శంకుస్థాపన చేసి రికార్డు సృష్టించారని గుర్తు చేశారు.

బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నపుడు శరవేగంగా జరిగిన ఆసుపత్రుల నిర్మాణ పనులు కాంగ్రెస్ రాగానే నత్తనడకన సాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రులు పూర్తయితే కేసీఆర్‌కు ఎక్కడ పేరు వస్తుందో అనే కురచ బుద్ధితో రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే టిమ్స్ ఆసుపత్రులను పూర్తి చేయడం లేదని ఆరోపించారు.

కమీషన్ల కోసం రెండేళ్లుగా పనులు పూర్తి చేయకుండా, వైద్య సేవలు అందకుండా ప్రజల జీవితాలతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చెలగాటం ఆడటం తగదన్నారు. అక్టోబర్ 3వ తేదీన బీఆర్‌ఎస్ పార్టీ తరఫున తాము కొత్తపేట టిమ్స్ ఆసుపత్రి సందర్శించి, ఆసుపత్రుల నిర్మాణాలు పూర్తి చేయడంతో ప్రభుత్వ పైఫల్యాన్ని నిలదీశామని, దీంతో హడావిడిగా సమీక్షలు నిర్వహించి, ఆసుపత్రి ప్రారంభ తేదీలు ప్రకటించిన మంత్రులు ప్రజల తరఫున ప్రశ్నించినందుకు బీఆర్‌ఎస్‌పై విమర్శలు గుప్పించినట్టు గుర్తు చేశారు.

ఇప్పటికైనా బీఆర్‌ఎస్ మీద నోరు పారేసుకోవడం మానేసి, రాజకీయ కక్ష సాధింపు చర్యలను పక్కనపెట్టి టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలు వెంటనే పూర్తి చేయాలని సూచించారు. పేదలకు సైతం అత్యున్నతమైన వైద్యం అందాలనే ఆలోచనతో కేసీఆర్ ప్రారంభించిన టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.