24-11-2025 12:54:14 AM
-30 మంది విద్యార్థుల భవిషత్కు ఆటంకం
-ఎఫ్ఎస్ఎంకు బదులుగా ఆన్లైన్లో హెచ్ఆర్డీ ఎంట్రీ
-ముందుగానే గుర్తించిన విద్యార్థులు
-ప్రిన్సిపాల్, ఎగ్జామినేషన్ బ్రాంచ్ దృష్టికి తీసుకెళ్లినా.. పట్టించుకోని వైనం
-అందరూ పరీక్షలు రాసినా..ఆబ్సెంట్.. ఫెయిలైనట్లు ఫలితాలు
-లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో ఘటన
మంచిర్యాల, నవంబర్ 23 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల అధ్యాపకుల తప్పిదం వల్ల పీజీ చేస్తున్న ఓ బ్యాచ్ మొత్తం ఫెయిల్ అయ్యింది. 30 మంది విద్యార్థుల భవిషత్కు ఆటంకం కలిగింది. ఎఫ్ఎస్ఎంకు బదులుగా ఆన్లైన్లో హెచ్ఆర్డీ ఎంట్రీగా ఎంట్రీ చేశారు.
సెలెక్టివ్ సబ్జెక్టుల వారీగా తప్పుడు కోడ్లను నమోదు చేశారు. ఈ విషయం ముందుగానే గుర్తించిన విద్యార్థులు.. ప్రిన్సిపాల్, ఎగ్జామినేషన్ బ్రాంచ్ దృష్టికి తీసుకెళ్లారు. అయినా వారు పట్టించుకోలేదు. దీంతో విద్యార్థులందరూ పరీక్ష లు రాసినా.. గైర్హాజరైనట్లు, ఫెయిలైనట్లు ఫలితాలు వచ్చాయి.
విద్యార్థులు కళాశాలలో జాయిన్ అయ్యే సమయంలో, పరీక్షలు రాసే సమయంలో హాల్ టికెట్ నెంబర్లు ఎలా వేయాలో, పరీ క్ష ఎలా రాయాలో.. చెప్పి వారి భవిష్యత్ నష్టపోకుండా చూడాల్సిన కళాశాల నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల ఏడాది పాటు చదివిన పీజీ విద్యార్థులంతా నష్టపోయారు. మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్(పీజీ) కోర్సులైన ఎంకామ్తో పాటు ఎంఎస్సీ (కంప్యూటర్స్), ఎంఎస్సీ(మ్యాథ్స్), ఎంఏ (ఎక నామిక్స్) ఉన్నాయి.
2023లో జరిగిన సీపీ జీ సెట్ ద్వారా లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో 30 మంది విద్యార్థులు ఎంకాం(పోస్ట్ గ్రాడ్యుయేషన్) లో అడ్మిషన్లు పొం దారు. 2023 - రెండు సెమిస్టర్లు (కామన్ సబ్జెక్టులు), 2024 - రెండు సెమి స్టర్లు (ఎలెక్టెడ్ సబ్జెక్టులు) ఉంటాయి. ఈ క్రమంలో మూడో సెమ్లో సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్టుల ఆర్డర్నే నాలుగో సెమ్లో సైతం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంత వరకు బాగానే ఉన్నా కళాశాల యాజమాన్యం తప్పిదం వల్ల విద్యార్థుల భవిష్యత్కు అడ్డుకట్టగా మారింది.
పీజీలో తప్పుడు సబ్జెక్టుల ఎంపికతో..
పీజీ చివరి సెమ్ (2025, మే నెల)లో జరుగాల్సిన పరీక్ష మ్యాపింగ్ చేయడంలో జరిగిన తప్పిదం విద్యార్థులకు శాపంగా మారింది. ఎంకామ్ జనరల్ విద్యార్థులు మూడో సెమ్లో ఫైనాన్సియల్ సర్వీస్ మేనే జ్ మెంట్ సెలెక్ట్ చేసుకొని పరీక్షకు హాజరయ్యారు. నాలుగో సెమ్లో సైతం ఫైనాన్సి యల్ సర్వీస్ మేనేజ్ మెంట్ (ఎఫ్ఎస్ఎం) సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది.
విద్యార్థులు నాలుగో సెమ్ ఫీజులు కళాశాలలో కట్టగా యాజమాన్యం ఆన్లైన్లో సెలెక్టివ్ సబ్జెక్టులను కోడ్ల వారీగా నింపాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఫైనాన్సియల్ సర్వీస్ మేనేజ్ మెంట్ (ఎఫ్ఎస్ఎం)కు బదులుగా హూమ న్ రిసోర్స్ డెవలప్మెంట్ (హెచ్ఆర్డీ) ఎంట్రీ చేయడంతో విద్యార్థులకు మూడు సబ్జెక్టులలో ఒకటి మారి హాల్ టికెట్లు వచ్చాయి. ఈ విషయం గమనించిన విద్యార్థులు ముందుగానే కళాశాల ప్రిన్సిపాల్, ఎగ్జామినేషన్ బ్రాంచ్ దృష్టికి తీసుకెళ్లారు. అయినా పట్టించుకోకపోవడంతో విద్యార్థులకు నష్టం తప్పలేదు.
తప్పుడు కోడ్ల ఎంపిక.. ఏడాది విద్యకు అఘాతం
పీజీ కోర్సులో చేరిన విద్యార్థులు చదివిన కోర్సుకు విరుద్ధంగా కళాశాల అధికారులు తప్పుడు కోడ్ (సబ్జెక్టు)లను ఎంపిక చేయడంతో ఒక బ్యాచ్ కి బ్యాచ్ విద్యా సంవత్స రాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఇటీవల విడుదలైన పరీక్షా ఫలితాల్లో ఫైనాన్సియల్ సర్వీసెస్ మేనేజ్ మెంట్ (ఎఫ్ఎస్ఎం) పరీక్షకు గైర్హాజరు అయినట్లు, అందరూ ఫెయిలైనట్లు ఫలితాలు వచ్చాయి. కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా కీలకమైన సెమిస్టర్ పరీక్షలో తప్పుడు సబ్జెక్టు (కోడ్)లను ఎం పిక చేసి, నమోదు చేయడం వల్ల అందరి భవిష్యత్కు నష్టం జరిగిందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
విద్యార్థులకు న్యాయం చేస్తాం
ఎగ్జామ్ బ్రాంచ్ వద్ద తప్పిదం జరిగింది. ఈ విషయం కేయూ కంట్రో లర్, డీన్, డీఓఎస్ల వద్ద నుంచి వీసీ ఛాంబర్ వద్ద ఉంది. ఉన్నతాధికారులకు, కమిషనర్, వీసీలకు సమాచారం ఇచ్చాం. యూనవర్సిటీలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ దృష్టికి తీసు కెళ్లాం. విద్యార్థులకు న్యాయం జరిగేలా చూస్తాం.
మహాత్మ సంతోష్, ప్రిన్సిపాల్, ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల, లక్షెట్టిపేట