10-06-2025 12:00:00 AM
పలు దఫాలుగా యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లిన పరిష్కారం కాని సమస్య..
ఏఐటీయూసీ కేంద్ర ఉపాధ్యక్షుడు వెంకటస్వామి
బెల్లంపల్లి అర్బన్, జూన్ 9 : కార్మికులకు అవసరమైన సరిపడా ఔషధాల సరఫర చేయాలనీ ఏఐటీయూసీ నేతృత్వంలో బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్ ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ కేంద్ర ఉపాధ్యక్షుడు మిట్టపల్లి వెంకట స్వామి, కార్యదర్శిలు ఎస్ తిరుపతి, దాగం మల్లేష్ మాట్లాడారు. సింగరేణి సంస్థలో కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు దీర్ఘకాలిక వ్యాధులకు ప్రతినెల సరఫరా చేసే ఔషధాలు సరిపడ లేనందున ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు.
గత రెండు నెలలు కార్మికులకు ఔషధాలు అందించడంలో యాజమాన్యం వైఫల్యం చెందిందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి సంస్థలో వేల కోట్ల లాభాలు అర్జిస్తున్న కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు పదవీ విరమణ కార్మికులకు ప్రతినెల దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన ఔషధాలు అందడం లేదని మండిపడ్డారు. 2 నెలలుగా పూర్తిస్థాయిలో సరఫరా లేక కార్మికులు, రిటైర్డ్ కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.
ఆసుపత్రిలో నెలకొన్న మందుల కొరతను పలు దఫాలుగా యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లిన నేటికి ఆ సమస్య పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. ఔషధాలు పూర్తిస్థాయిలో సరఫరా లేకపోవడం వల్ల నెలకు ఇవ్వాల్సిన ఔషధాలను 10 రోజులకు కుదించి ఇస్తున్నారని వెల్లడించారు. దీనివల్ల సరిపడ మందుల అందక కార్మికులు అనారోగ్య బారిన పడుతున్నారని మండిపడ్డారు.
దూర ప్రాంతాల నుండి పదవి విరమణ పొందిన కార్మికుకి 10 రోజులకోసారి, 5 రోజులకు ఒకసారి ఔషధాలు ఇస్తున్నారని తెలిపారు. దీనివల్ల కార్మికులు పదవి విరమణ పొందిన కార్మికులు తీవ్ర ఇబ్బందులకు ఆందోళనలకు గురవుతున్నారన్నారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం వెంటనే స్పందించి ఔషధాలను వెంటనే పూర్తిస్థాయిలో సరఫరా చేసి కార్మికులందరికీ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో గుర్తింపు కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళనను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఏరియా హాస్పిటల్ డివైసీఎం డాక్టర్ మధు కుమార్ కు గుర్తింపు సంఘం ప్రతినిదులు వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఏరియా సహాయ కార్యదర్శి దాసరి తిరుపతి గౌడ్, బయ్య మొగిలి బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ హాస్పిటల్ ఫిట్ కార్యదర్శి దాసరి రాజా శ్రీధర్, మీనుగు లక్ష్మీనారాయణ, రత్నం ఐలయ్య, పద్మ,దాసరి జ్యోతి, మారం శ్రీనివాస్ మంతెన రమేష్, ఎస్ నాగేశ్వరరావు, కొండపల్లి నరసయ్య, ఐ సంపత్, అన్వేష్, దాడి రమేష్, మంతెన భాస్కర్ రత్నం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.