04-07-2025 12:05:14 AM
నల్లగొండ టౌన్, జూలై ౩ : నల్లగొండ ఉమ్మడి జిల్లాల్లో మైక్రో ఫైనాన్స్ సంస్థలు మళ్లీ పడగ విప్పుతున్నాయి. నల్లగొండ జిల్లా కేంద్రంలో పుట్ట గొడుగు లాగా కార్యాలయాలు ఏర్పాటు చేసి, అధిక వడ్డీకి రుణాలు ఇస్తున్నాయి.పట్టణాలు, మండలాల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బ్రాంచీలు తెరిచాయి. పేదలు, మధ్య తరగతి వారి ఆర్థిక అవసరాలు, బలహీనతలను ఆసరాగా తీసుకుని వ్యాపారం చేస్తున్నాయి.
మహిళలే టార్గెట్గా, వారిని గ్రూపులుగా చేసి అప్పులు ఇస్తున్నాయి. ఒకరు కట్టకుంటే మిగతా వారంతా కలసి కట్టాలనే నిబంధనలు పెడుతూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నాయి. ఒకవేళ వాయిదాలు కట్టలేకపోతే... చస్తే చావండి..
డబ్బులు మాత్రం కట్టండి’ అంటూ తీవ్రంగా వేధింపులకు దిగుతున్నాయి. ఈ మైక్రో ఫైనాన్స్ వలలో చిక్కి వేలాది కుటుంబాలు విలవిలలాడుతున్నాయి. సంపాదించే కాసింత కూడా వడ్డీలకే సరిపోవడం లేదంటూ.. కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితి నెలకొంది.
రిజర్వు బ్యాంకు నిబంధనలు అంటూ....
మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఐదు నుంచి ఇరవై మంది వరకు మహిళలను గ్రూపుగా చేసి ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఆధార్ కార్డు, పాన్ కార్డు జిరాక్స్ లు తీసుకుని రుణాలు ఇస్తున్నాయి. రిజర్వు బ్యాంకు నిబంధనల మేరకు బ్యాంకులుగా చేయించుకుని చట్టబద్ధంగానే వ్యాపారం నిర్వహిస్తున్నట్లుగా రికార్డుల్లో చూపుతున్నాయి. వివిధ పేర్లతో ముందుగానే కోతలు పెడుతున్నాయి.
అడ్డగోలు వడ్డీలు వసూలు చేస్తున్నాయి. ఉదాహరణకు గ్రూపులో ఒక్కో మహిళకు రూ.35 వేల చొప్పున అప్పుగా ఇస్తారు. ఇందులోనూ బీమా, ప్రాసెసింగ్ ఫీజు పేరిట రూ.2 వేలు ముందే కోతపెట్టి.. రూ.33 వేలు మాత్రమే మహిళల చేతికి ఇస్తారు.
ఈ అసలు, వడ్డీ కలిపి వారానికి రూ.900 చొప్పున ఏడాది పాటు చెల్లించాలి. అంటే రూ.28 వేలకుగాను మొత్తంగా రూ.44,800 కట్టాల్సి ఉంటుంది. అంతేకాదు ఏ వారమైనా వాయిదా సమయానికి చెల్లించకుంటే.. అదనంగా రూ.100 జరిమానా కింద వసూలు చేస్తారు.
అసలు లక్ష్యం పక్కదారి పట్టి....
స్పందన, కీర్తన, ఫిన్కేర్, ఒరిగో, సౌత్ ఇండియా, అన్నపూర్ణ, యాక్సిస్, పిరమిల్, ఐ రిఫ్, క్రిస్, బంధన్, ఎపాక్, ెమ్ లోన్స్ ఫైనాన్స్, వెరిటాస్ మైక్రో ఫైనాన్స్, ప్యూజియన్ బ్యాంకు, ఆశీర్వాద్ బ్యాంకు, ఎఫ్ఎఫ్ఎల్, ఫెడరల్ బ్యాంకు వంటి సంస్థలు మైక్రో ఫైనాన్స్ చేస్తున్నాయి.
వాస్తవానికి పేదలకు తక్కువ మొత్తలోకో రుణాలు సులువుగా అందించడం, ఆర్థిక చేయూత ద్వారా పేదరికాన్ని తగ్గించడం లక్ష్యంగా మైక్రో ఫైనాన్స్ వ్యవస్థల లక్ష్యం. సూక్ష్మరుణాల ద్వారా వ్యక్తులు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి, విస్తరించడానికి తోడ్పడాలి. కానీ ఇక్కడ అందుకు పూర్తి భిన్నంగా జరుగుతోంది.
పోటాపోటీగా పాగా.. అడ్డగోలు వడ్డీ..
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో విస్తరించిన టాప్ మైక్రో ఫైనాన్స్ సంస్థలు నల్లగొండ జిల్లాలోను పాగా వేశాయి. అవి రూ.8 వేల నుంచి రూ.50 వేల వరకు మహిళలకు రుణాలు ఇస్తున్నాయి. రుణాలు ఇచ్చే సమయంలోనే కాల పరిమితిని బట్టి 36 శాతం వరకు వడ్డీ పడుతుందని ఒప్పంద పత్రంలోనే పేర్కొంటున్నాయి.
ఒక్కో సంస్థ ఒక్కోరకంగా డాక్యుమెంట్, ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్టీ, బీమా వంటివాటి పేరిట రూ.2,500 నుంచి రూ.4 వేల వరకు రుణంలో ముందే కోతపెడుతున్నాయి. అన్నీ కలిపి లెక్కేస్తే పేరుకు 36 శాతం అయినా, 50శాతం దాకా వడ్డీ పడుతున్న పరిస్థితి. పేదలు ఈ వడ్డీల భారం భరించలేక ఆర్థిక ఇబ్బందుల్లో పడుతున్నారు. ఆవేదనతో ప్రాణాలు తీసుకోవడానికీ ప్రయత్నిస్తున్నారు.