04-07-2025 12:02:41 AM
ఆత్మీయ భరోసా పథకం అమలులో జాప్యంపై హైకోర్ట్ సీరియస్
హైదరాబాద్ సిటీబ్యూరో జూలై 3 (విజయక్రాంతి): మున్సిపాలిటీల్లో భూమిలేని నిరుపేదల కోసం ఉద్దేశించిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలులో జాప్యంపై తెలంగాణ హైకోర్టు తీవ్రఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పథకానికి సంబంధించి గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోలేదని దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం, రాష్ర్ట చీఫ్ సెక్రటరీ కే రామకృష్ణరావుతో పాటు పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి టీకే శ్రీదేవీలకు నోటీసులు జారీ చేసింది.
నారాయణపేట జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలుపై హైకోర్టులో గతంలో పిల్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు, పిటిషనర్ను సంబంధిత శాఖలకు మరోసారి వినతిపత్రం ఇవ్వాలని సూచించింది. అంతేకాకుం డా, పిటిషనర్ ఇచ్చిన వినతిపత్రం పై వెంటనే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ 2024, జనవరి 27న విచారణ ముగించింది.
అయితే, హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ప్రభుత్వం వాటిని అమ లు చేయడంలో జాప్యం చేసిందని, తద్వారా కోర్టు ధిక్కరణకు పాల్పడిందని ఆరోపిస్తూ పిటిషనర్ మరోసారి హైకో ర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై తాజా గా విచారణ జరిపిన హైకోర్టు, రాష్ర్ట ఉన్నతాధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది.