బాన్సువాడలో ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు
ప్రధాన విధుల్లో ముస్లిం సోదరుల భారీ ర్యాలీ
బాన్సువాడ, ఆగస్టు 26 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో పవిత్ర మిలాద్ ఉన్ నబీ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ ర్యాలీతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది.ర్యాలీలో చిన్నారులు, యువకులు, పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రవక్త మహమ్మద్ బోధించిన శాంతి, సోదరభావం, ప్రేమ, మానవత్వం, పరస్పర గౌరవం వంటి విలువలను ప్రజలకు చాటుతూ ర్యాలీ కొనసాగింది. పలుచోట్ల నిర్వాహకులు పాల్గొన్న వారికి స్వాగతం పలికి తాగునీరు,పండ్లు, జ్యూస్ ఇతర సౌకర్యాలు కల్పించారు.పట్టణంలోని ప్రధాన కూడళ్లు, వీధుల గుండా ర్యాలీ కొనసాగడంతో పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా పోలీసు సిబ్బంది చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.






