18-05-2025 03:41:15 PM
రాజుకుంటోన్న ప్రోటోకాల్ రగడ..
మాల మహానాడు ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి యాదగిరి..
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు(State Minister Sridhar Babu) పెద్దపల్లి జిల్లా ఎంపీ గడ్డం వంశీకృష్ణ(MP Gaddam Vamsi Krishna)కు క్షమాపణ చెప్పాలని మాలమహానాడు ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి కాసర్ల యాదగిరి డిమాండ్ చేశారు. ఆదివారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాల్లో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ పేరును ఫ్లెక్షీల్లో చేర్చకుండా అవమానపరిచారన్నారు. మాల సామాజిక వర్గానికి చెందిన గడ్డం వంశీకృష్ణ పేరును చేర్చకుండా అవమాన పరచడం అమానుషమన్నారు.
ప్రోటోకాల్ ను ఉద్దేశపూర్వకంగానే తుంగలో తొక్కారని విమర్శించారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ లను సైతం సరస్వతి పుష్కరాలకు ఆహ్వానించకుండా విస్మరించారని పేర్కొన్నారు. దళిత సామాజిక వర్గం అంటే మంత్రి శ్రీధర్ బాబుకు అంత చులకనై పోయిందని మండిపడ్డారు. ఇందుకు గాను గడ్డం వంశీకృష్ణ కు మంత్రి శ్రీధర్ బాబు నైతిక బాధ్యత వహిస్తూ బేశరత్తుగా క్షమాపణ చెప్పి తప్పు సరిదిద్దుకోవాలని కోరారు. లేనియెడల రాష్ట్ర వ్యాప్తంగా మాల మహానాడు ఆద్వర్యంలో నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని రాజనర్సు, నియోజక వర్గ అధ్యక్షుడు ఎరుకల శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు లింగాల అమృత, నాయకులు కాదాసి ప్రకాష్, కంది రాజేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.