మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం
హైదరాబాద్: చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌస్(Gulzar House) వద్ద జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడి ఉస్మానియా ఆసుపత్రి(Osmania Hospital)లో చికిత్స పొందుతున్న బాధితులను డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka), మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. ప్రమాద ఘటనపై డిప్యూటి సీఎం భట్టి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఘటన జరగడం అత్యంత దురదృష్టకరంగా భావిస్తున్నామన్నారు.
మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారని, సహాయక చర్యల్లో 11 ఫైరింజన్లు, ఒక రోబోను వాడారని తెలిపారు. ప్రమాద తీవ్రత పెరగకుండా సిబ్బంది నియంత్రించగలిగారని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని, ఇలాంటి ఘటనలు జరగకుండా నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఘటనస్థలిని పరిశీలించామని తెలిపారు.






