12-10-2025 01:54:40 AM
మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే సుధీర్రెడ్డి
ఎల్బీనగర్, అక్టోబర్ 11 : అమెరికాలో ఇటీవల గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో దుర్మరణం చెందిన పోలే చంద్రశేఖర్ మృతదేహం శనివారం తెల్లవారు జామున బీఎన్రెడ్డి డివిజన్ పరిధిలోని టీచర్స్ కాలనీలోని ఆయన స్వగృహానికి చేరింది. ఈ మేరకు మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తదితరులు చంద్రశేఖర్ మృతదేహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు.
బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ మృతుడి కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని, అధైర్య పడొద్దని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్రేషియా ప్రకటించారు. మృతుడి సోదరులకు అర్హతల మేరకు ప్రైవేట్లో లేదా ఔవుట్ సోర్సింగ్ ద్వారా ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.