22-06-2025 12:46:12 AM
ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా విరుచుకుపడిన ఇజ్రాయెల్
టెహ్రాన్/టెల్ అవీవ్, జూన్ 21: ఇరాన్ లో అణ్వాయుధ కేంద్రాలే లక్ష్యంగా దాడు లు మొదలుపెట్టిన ఇజ్రాయెల్ తమ దాడు లను మరింత తీవ్రతరం చేసింది. యుద్ధం లో తొమ్మిదో రోజు ఇరాన్లోని కీలక అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ భారీ క్షిపణులతో విరుచుకుపడింది. ముఖ్యంగా ఇరాన్లో అణు కేంద్రానికి నిలయమైన ఇస్ఫహాన్ నగరంపై ఇజ్రాయెల్ దళాలు దాడులు జరి పిందని ఇరాన్ ప్రభుత్వం ధ్రువీకరించింది.
అయితే ఈ దాడిలో ఎలాంటి ప్రమాదకర వాయువులు లీక్ అవ్వలేదని తెలిపింది. దాడికి ముందే కేంద్రాన్ని ఖాళీ చేయించామని, రేడియేషన్ ముప్పు ఎంత మాత్రం లేదని అధికారులు తెలిపారు. అక్కడ అణ్వాయుధాల తయారీకి అవసరమయ్యే పరికరాలు, ప్రాజెక్టులు ఉన్నట్టు వెల్లడించింది. అంతేగాక ఇరాన్లోని ఖొండాబ్ అణు పరిశోధనా రియాక్టర్ సమీపంలోని ప్రాంతంపై కూడా ఇజ్రాయెల్ దాడులు జరిపింది.
ఇరాన్లోని కెర్మాన్షాలోని నాప్ట్షహర్ గ్రామంపై జరిపిన దాడుల్లో ఐదుగురు ఇరాన్ సైనికులు మృతి చెందారు. కాగా ఖుడ్స్ ఫోర్స్కు చెందిన పాలస్తీనియన్ కార్ప్స్ కమాండర్ సయీద్ ఇజాదీ సహా ఖుద్స్ ఫోర్స్ ఆయుధాల సరఫరా విభాగం కమాండర్ బెహ్నామ్ షాహ్రియారీలను హతమార్చినట్టు ఇజ్రాయెల్ రక్షణ దళం (ఐడీఎఫ్) పేర్కొంది. ఖోమ్ నగరంలోని ఒక అపార్ట్మెంట్పై రాత్రిపూట జరిపిన వైమానిక దాడిలో వీరు మరణించినట్టు ఐడీఎఫ్ తెలిపింది.
టెహ్రాన్ సహా చాలా ప్రాంతాల్లో ఇజ్రాయెల్ తమ యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. పశ్చిమ ఇరాన్లోని బాలిస్టిక్ క్షిపణుల తయారీ కేంద్రాలపైనా 25 యుద్ధ విమానాలతో దాడులు చేయడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. మరోవైపు ఇరాన్ కూడా తమ దాడుల తీవ్రతను పెంచింది. ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ సహా హైఫా, బీర్షెబా నగరాలపై బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది.
ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ఇజ్రాయెల్లోని నెవాటిమ్, హాట్జెరిమ్ వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపింది. పరస్పర దాడుల్లో ఇప్పటివరకు ఇరాన్లో మరణాల సంఖ్య 657కు పెరగ్గా.. గాయపడిన వారి సంఖ్య మూడు వేలు దాటినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్లో మాత్రం మృతుల సంఖ్య 26కు చేరుకోగా.. 1500 మందికి పైగా గాయపడ్డారు.
అయితే ఇరాన్ ప్రయోగిం చిన అనేక డ్రోన్లను జనావాసాలు లేని ప్రాంతాల్లో కూల్చేయడంతో ప్రజలకు ఎటువంటి హానీ జరగలేదని ఐడీఎఫ్ దళాలు పేర్కొన్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధానిన ఆపడాని కి తీసుకోవాల్సిన దౌత్యపర మైన నిర్ణయాలపై చర్చలు జరిపేందుకు యూరోపియన్ విదేశాంగ మంత్రులు ఇప్పటికే ఇరాన్ విదేశాంగ శాఖతో చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణ లెబనాన్లోని హిజ్బుల్లా స్థావరంపై దాడి చేసి సంస్థకు చెందిన ఇద్దరు కమాండర్లను చంపినట్టు ఇజ్రాయెల్ ఒక ప్రకటన విడుదల చేసింది.
దాడుల తీవ్రత పెంచండి: కాట్జ్
ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ ఆ దేశ రక్షణ దళాలు (ఐడీఎఫ్)కు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇరాన్ పాలనను అస్థిరపరచడానికి దాడులను మరింత తీవ్రతరం చేయాలని సూచించారు. ఇరాన్ ప్రభుత్వ కేంద్రాలు, సంస్థలు, మౌలిక సదుపాయాలు, ఆస్తులను లక్ష్యంగా చేసుకోవాలన్నారు. టెహ్రాన్లోని శక్తిమంతమైన బాసిజ్, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ వంటి కేంద్రాలను ధ్వంసం చేయాలని సూచించారు.
అమెరికా చేరికతో అందరికీ ప్రమాదమే: ఇరాన్ మంత్రి
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలో తాము చేరాలా వద్దా అన్న అంశంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకుంటారని వైట్హౌస్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధంలో ఇజ్రాయెల్తో అమెరికా జట్టు కడితే కేవలం ఇరాన్కే కాకుండా ప్రతి ఒక్కరికీ ప్రమాదం పొంచి ఉన్నట్లే అని పేర్కొన్నారు. అమెరికాతో అణు ఒప్పంద చర్చలు జరపడానికి తాము సిద్ధంగా లేమని అబ్బాస్ మరోసారి స్పష్టం చేశారు.
ఇజ్రాయెల్కు అంత సామర్థ్యం లేదు: ట్రంప్
ఇరాన్లోని అణు కేంద్రాలపై దాడి చేసేందుకు అమెరికా అనుమతి కోసం వేచి చూడలేమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. తమ సాయం లేకుండా ఇరాన్లోని ఫోర్డ్లోని భూగర్భ అణుకేంద్రాన్ని నాశనం చేసే సామర్థ్యం ఇజ్రాయెల్కు లేదన్నారు. ఒకవేళ వారు దాడులు జరిపినా పెద్దగా ప్రభావం చూపించ వన్నారు. ఈ సందర్భంగా తాను దౌత్యానికి కట్టుబడి ఉన్నానని చెప్పిన ట్రంప్ సైనిక కార్యకలాపాలను ఆపేయాలని ఇజ్రాయెల్ను ఒప్పించడం ప్రస్తుతానికి అసంభవమన్నారు.
హిజ్బుల్లా దాడులపై ఇజ్రాయెల్ వివరణ
ఇరాన్తో యుద్ధం చేస్తూనే ఇజ్రాయెల్ మరోవైపు దక్షిణ లెబనాన్లో హిజ్బుల్లా స్థావరంపై దాడులకు దిగింది. అయితే లెబనాన్పై దాడులు ఎందుకు చేశారన్న దానిపై ఇజ్రాయెల్ వివరణ ఇచ్చింది. ఇరాన్తో మంచి సంబంధాలు కొనసాగిస్తున్న హిజ్బుల్లా వారి అండదండలతో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తుంది. ప్రస్తుత యుద్ధంలో ఇరాన్కు మద్దతిస్తున్న హిజ్బుల్లా నుంచి ఉత్తర ఇజ్రాయెల్కు ముప్పు పొంచి ఉందన్న కారణంతోనే వారిపై దాడులకు దిగినట్టు తెలిపింది.
ఈ మేరకు శుక్రవారం దక్షిణ లెబనాన్లోని నబతియా ప్రాంతంలో హిజ్బుల్లా టాప్ కమాండర్ మహమ్మద్ ఖాదర్ అల్\ హతమార్చినట్టు ఇజ్రాయెల్ రక్షణ దళం (ఐడీఎఫ్) ఒక ప్రకటనలో పేర్కొంది. ఇజ్రాయెల్లోని నహారియా, హైఫా ప్రాంతాల్లో దాడులు జరగడంలో హుస్సేనీ కీలక పాత్ర పోషించినట్టు ఐడీఎఫ్ తెలిపింది. అంతకుముందు బుధవారం రాత్రి మరో హిజ్బుల్లా కమాండర్ మహమ్మద్ అహ్మద్ ఖారిస్ను కూడా ఐడీఎఫ్ దళాలు మట్టుబెట్టాయి.
ఇరాన్లో భూకంపం.. అణు పరీక్షలే కారణమా?
ఇజ్రాయెల్ దాడులతో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న ఇరాన్లో శనివారం భూకంపం సంభ వించింది. సెమ్నాన్ ప్రాంతంలో 5.2 తీవ్రతతో ఇది చోటుచేసుకోగా.. 10 కిలోమీటర్ల మేర భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. ఇజ్రాయెల్తో ఉద్రిక్తతల వేళ టెహ్రాన్ రహస్యంగా అణు పరీక్షలు నిర్వహించి ఉండవచ్చని, భూకంపానికి ఇది కారణం కావచ్చనే అనుమానాలు మొదలయ్యాయి. అంతరిక్ష, క్షిపణి కాంప్లెక్స్ ఉన్న నగరానికి సమీపంలోనే భూకంపం సంభవించడం దీనికి మరింత ఊతమిచ్చింది.