calender_icon.png 4 September, 2025 | 7:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బుగులోని గుట్టను రెండో తిరుపతిగా అభివృద్ధి చేస్తా

01-09-2025 11:08:44 PM

రేగొండ,(విజయక్రాంతి): మండలంలోని తిరుమలగిరి గ్రామ శివారులో వెలసిన బుగులోని గుట్టను రెండో తిరుపతిగా అభివృద్ధి చేస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. సోమవారం స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే రూ.1.60 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. కోరిన కోరికలు తీర్చి భక్తుల బుగులు పోగొట్టే శ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామి జాతరను రెండో తిరుపతిగా తీర్చిదిద్దడానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ప్రకృతి ఒడిలో అద్భుతమైన కొండల నడుమ స్వయంభు గా వెలిసి భక్తుల కష్టాలు తీర్చే ఆపద్బాంధవుడి లా  మారిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మన జిల్లాలో కొలువై ఉండడం మన అదృష్టమన్నారు.

నవంబర్ మాసంలో కార్తీక పౌర్ణమికి 5 రోజుల పాటు జరిగే ఈ జాతరకు లక్షలాది మంది భక్తులు తరలి రావడం స్వామి వారి దర్శనం కోసం భక్తులు కొండ పైకి ఎక్కడంలో ఇబ్బందులు ఎదుర్కోవడం నేను చూశాను. గత పాలకుల నిర్లక్ష్యంతో జాతర అభివృద్ధిలో వెనుకబడింది. ఎమ్మెల్యేగా గెలిస్తే అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చా దీంతో ఇప్పుడు ఎమ్మెల్యేగా జాతరకు ప్రభుత్వ సహకారంతో పనులు తీసుకువచ్చానని అన్నారు. జాతరలో రూ.1.60 కోట్ల తో కొండపైకి ఎక్కే మెట్ల ప్రాంగణాన్ని వెడల్పు,నీటి కొలను వెడల్పు,మంచి నీటి బావిని వెడల్పు చేయడం అలాగే వచ్చే జాతరకు మరో రూ.2 కోట్ల నిధులు తీసుకువచ్చి స్వామి వారికి కళ్యాణ మండపం, భక్తుల విశ్రాంత గది, శివాలయం అభివృద్ధి పనులకు శ్రీకారం చేపడుతానన్నారు.

అలాగే గతంలో రూ.5.70 కోట్లతో పాండవుల గుట్ట,బుగులోని గుట్ట, జగ్గయ్యపేట, తిరుమలగిరి,లను కలుపుతూ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశానని కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పనుల్లో జాప్యం జరిగిందన్నారు. త్వరలోనే అన్ని పనులు పూర్తిచేసి జాతరలో భక్తులకు  ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. పాండవుల గుట్ట,బుగులోని జాతర కొండలు, మైలారం గుహలు, రామప్ప,కోట గుళ్ళు ను ఎకో టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు.