04-09-2025 06:31:17 PM
ఆరు గ్యారంటీల అమలేది?
యూరియా కొరత తీర్చేదేన్నడు.
బీజేపీ నాయకుడు రఘునాథ్ ధ్వజం
లక్షేట్టిపేట (విజయక్రాంతి): సాధ్యం కానీ హామీలతో కాంగ్రెస్ గద్దెనెక్కి ప్రజలను మోసం చేస్తుందని బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు వేరేబెల్లి రఘునాథ్ ధ్వజమెత్తారు. గురువారం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో బీజేపీ నాయకులతో కలిసి తహసీల్దార్ దిలీప్ కుమార్(Tehsildar Dilip Kumar)కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ నాయకులు రైతులకు యూరియా కొరత ఉంటే ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. ముఖ్యంగా చెన్నూర్ నియోజకవర్గంలోని పలు మండలాలకు లేని యూరియా కొరత మంచిర్యాల నియోజకవర్గంలోని మండలాలకు ఎందుకు వచ్చిందో రైతులు అర్ధం చేసుకోవాలని సూచించారు. మంత్రి వివేక్ వెంకటస్వామి వలన ఆ చెన్నూర్ నియోజకవర్గానికి ఎక్కువ యూరియా బస్తాలు వచ్చాయని, ఇక్కడి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ముందే స్పందించి ఉంటే రైతులకు ఈ పరిస్థితి వచ్చేది కాదని విమర్శించారు.
అంతేకాకుండా కల్యాణ లక్ష్మీ, తులం బంగారం,ప్రతి నెల మహిళలకు ఆర్ధిక సహకారం, వితంతువుల, దివ్యాంగుల పెన్షన్, విద్యార్థులకు నిరుద్యోగ భృతి, స్కూటీలు, జాబ్ క్యాలెండరు లాంటి హామీలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.అంతకుముందు జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు ముత్తే సత్తయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళబొల్లి మాటలతో ప్రజలను మభ్య పెడుతోందన్నారు.ఇప్పటికైన రైతులతో పాటు ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. అంతకుముందు పట్టణంలోని పలు వీధుల గుండా బీజేపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ తీసి హామీలు అమలు చేయాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు హరి గోపాల్, హేమంత్ రెడ్డి, స్వామి రెడ్డి, రమేష్ జైన్, ప్రభాకర్, కార్యకర్తలు పాల్గొన్నారు.