calender_icon.png 28 June, 2025 | 3:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వానికి విద్య వైద్యం అనేవి రెండు కండ్ల లాంటివి

27-06-2025 11:01:53 PM

వైద్యానికి ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తున్న ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు

అధికారులు నిర్లక్ష్యం వీడి ప్రభుత్వ వైద్యంపై ప్రజలలో భరోసా కల్పించాలి 

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో  సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలి

హెల్త్ రివ్యూలో ఎమ్మెల్యే  కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

మునుగోడు,(విజయక్రాంతి): ప్రభుత్వం వైద్యానికి నిధులు ఖర్చు చేస్తున్నప్పటికీ ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా వైద్య అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.ప్రభుత్వం పేద ప్రజలకు సర్వీస్ చేయడానికే ఉన్నదని ప్రభుత్వానికి విద్య వైద్యం అనేవి రెండు కళ్ళ లాంటివన్నారు. ప్రభుత్వ వైద్యంపై ప్రజలలో భరోసా కల్పించే విధంగా డాక్టర్లు పనిచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రభుత్వాసుపత్రిలో  సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సాధారణ ప్రసవాలు 75 శాతం అయ్యే విధంగా టార్గెట్ పెట్టుకోవాలని సూచించారు. ప్రతి గ్రామపంచాయతీలో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండేలా ప్రయత్నిస్తామన్నారు. చౌటుప్పల్ పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో డాక్టర్లు సిబ్బంది పేషంట్లపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వైద్యం చేయకుండా ప్రైవేట్ ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారని  ఎమ్మెల్యే దృష్టికి స్థానిక నాయకులు తీసుకురాగా తక్షణమే యాదాద్రి జిల్లా వైద్య అధికారి చిన్న నాయక్  కు ఫోన్ చేసి  ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చిన ఏ ఒక్క పేషంటును కూడా  ప్రైవేటు ఆసుపత్రులకు  రిఫర్ చేయూద్దన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అభివృద్ధి చేసుకుంటామన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది కొరతకు సంబంధించి  వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు.. ప్రజా వైద్యం విషయంలో  ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ వైద్యాధికారులు కలిసి ఐక్యత తో పని చేయాలని,ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లకు  నాణ్యమైన వైద్యాన్ని అందించి ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకాన్ని కలిగించే బాధ్యత మీదన్నారు.