ప్రభుత్వ కేంద్రాల్లోనే మద్దతు ధర
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు
పాపన్నపేట,(విజయక్రాంతి): రైతులు వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో విక్రయిస్తే మద్దతు ధర లభిస్తుందని, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సూచించారు. సోమవారం పాపన్నపేట మండల పరిధిలోని అన్నారం, ఎల్లాపూర్, యూసప్పేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దళారులను నమ్మి మోసపోవద్దని, తాలు లేకుండా, ప్రభుత్వం నిర్ణయించిన తేమ శాతం దాటకుండా రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల నిర్వహకులు తూకంలో పారదర్శకత వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఆకుల శ్రీనివాస్, నరేందర్ గౌడ్, ప్రభాకర్ రెడ్డి, గోవింద్ నాయక్, మల్లప్ప తదితరులు పాల్గొన్నారు.




