02-07-2024 06:03:07 AM
న్యూఢిల్లీ, జూలై 1: జూన్ నెలాఖరుకు రుతుపవనాలు దక్షిణ భారత్ మినహా అన్ని ప్రాంతాల్లో సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే 11శాతం తక్కువని సోమవారం భారత వాతావరణశాఖ ప్రకటించింది. గత నెలలో మధ్య భారత్లో 14శాతం, వాయువ్య ప్రాంతంలో 13శాతం, ఈశాన్యంలో 13 శాతం సగటు వర్షపాతం నమోదైంది. కానీ దక్షిణ భారత్లో మాత్రం 14 శాతం ఎక్కువ వర్షపాతం నమోదు కావడం విశేషం.
జూలైలోనైనా ఆశించిన మేర వర్షాలు కురుస్తాయేమోనని యావత్ దేశం ఎదురు చూస్తోంది. శుక్రవారం ఢిల్లీలో కుండపోత వర్షం కురిసి నగరం అతలాకుతలమైన సంగతి విధితమే. తిరిగి మంగళవారం నుంచి ఐదు రోజుల పాటు ఢిల్లీకి వర్ష సూచన ఉన్నట్లు ఐఎండీ ప్రకటించింది. అలాగే మంగళ, బుధవారాల్లో హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం రుతుపవనాలు ఉత్తర భారత్లోని తూర్పు ప్రాంతాలకు పయనిస్తున్నాయని, దీంతో ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్తో పాటు జమ్మూ కశ్మీర్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది.