11 April, 2026 | 8:27 PM

మహిళా ఉద్యోగినులకు నెలసరి సెలవు

16-08-2024 01:13 AM

స్వాతంత్ర దినోత్సవం వేళ ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం

ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే మహిళా ఉద్యోగినులకు నెలలో ఒకరోజు నెలసరి సెలవు

భువనేశ్వర్ (ఒడిశా), ఆగస్టు 15: స్వాతంత్ర దినోత్సవం వేళ ఒడిశా ప్రభుత్వం మహిళా ఉద్యోగినులకు శుభవార్త చెప్పింది. గురువారం కటక్‌లో జరిగిన స్వాతంత్ర వేడుకలో పాల్గొన్న ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పార్వతి పరీదా మాట్లాడుతూ.. రా్రష్ట్రంలోని మహిళా ఉద్యోగినులకు నెలలో ఒకరోజు నెలసరి సెలవు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినులకు ఇది వర్తిస్తుందని ఆమె తెలిపారు.

ఈ పాలసీ తక్షణమే అమల్లోకి వస్తుందని, మహిళా ఉద్యోగినులు ప్రతినెలా తమ పీరియడ్స్ టైంలో మొదటి లేదా రెండో రోజు ఈ సెలవును తీసుకోవచ్చని స్పష్టం చేశారు.  ఉద్యోగినుల శ్రేయస్సు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. మహిళలకు నెలసరి సెలవులు ఇవ్వాలంటూ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న క్రమంలో ఒడిశా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. తమ రాష్ట్రంలో కూడా ఈ పాలసీని అమలు చేయాలని దేశంలోని వివిధ రాష్ట్రాల మహిళా ఉద్యోగినులు డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పటికే నెలసరి సెలవులు అమలవుతున్న రాష్ట్రాలు, విద్యాసంస్థలు

  1. * బీహార్ (నెలలో రెండు రోజులు)
  2. * కేరళ (నెలలో మూడు రోజులు)
  3. * నల్సార్ వర్సిటీ, గుహవాటి వర్సిటీ, తేజ్‌పూర్ వర్సిటీ, పంజాబ్ వర్సిటీ.. విద్యార్థినులకు నెలసరి సెలవులు ప్రకటించాయి.