21-01-2026 08:20:17 PM
బూర్గంపాడు,(విజయక్రాంతి): స్వచ్ఛత, హరిత విద్యాలయ కార్యక్రమంలో భాగంగా జిల్లాస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మోరంపల్లి బంజర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. బుధవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మణరావు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు. పాఠశాలలో పరిశుభ్రత, జలసంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, హరిత కార్యక్రమాల అమలులో చూపిన నిబద్ధత, విద్యార్థుల్లో బాధ్యతాయుత దృక్పథాన్ని పెంపొందించడంలో చేసిన కృషికి ఈ గుర్తింపు లభించిందని అధికారులు తెలిపారు.
పాఠశాల ప్రాంగణంలో మొక్కల పెంపకం, స్వచ్ఛతపై అవగాహన కార్యక్రమాలు, విద్యార్థుల చురుకైన భాగస్వామ్యం అభినందనీయమని కలెక్టర్ ప్రశంసించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు లక్ష్మణరావు మాట్లాడుతూ, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లిదండ్రుల సమిష్టి సహకారంతోనే ఈ అవార్డు సాధ్యమైందని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని వినూత్న కార్యక్రమాలతో పాఠశాలను ఆదర్శంగా నిలుపుతామని అన్నారు. ఈ ఘనతతో మోరంపల్లి బంజర్ గ్రామంతో పాటు జిల్లా విద్యారంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.