23-02-2026 12:04:02 AM
నిల్వ నీటితో ప్రజల ఇబ్బందులు
అశ్వాపురం, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): అశ్వాపురం జగదంబ షాప్ స్ట్రీట్ లైన్లోని సీసీ రోడ్డు, మూలవద్ద రోడ్ పగిలిపోవడంతో గుంతలు ఏర్పడ్డాయి. ఆ గుంతల్లో గత రెండేళ్లుగా మురికి నీరు నిల్వ ఉండటంతో అక్కడ ఈగలు, దోమలు విపరీతంగా పెరిగి తీవ్ర దుర్వాసన వ్యాపిస్తోంది. ఈ పరిస్థితి కారణంగా చుట్టుపక్కల నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు తెలిపారు.
నిల్వ నీటితో దోమలు అధికంగా పెరిగి విషజ్వరాలు వ్యాపిస్తున్నాయని ఆ వీధి ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. చెడు వాసనతో పాటు దోమల సమస్య రోజురోజుకు పెరుగుతోందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని గ్రామ పంచాయతీకి ఎన్నిసార్లు తెలియజేసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు తక్షణమే స్పందించి సీసీ రోడ్డుకు మరమ్మతులు చేసి, నిల్వ నీటిని తొలగించి శుభ్రత చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.