20-09-2025 12:00:00 AM
ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్ రావు
మహబూబాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): లక్ష్యంతో చదివి, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే పురుషులకు దీటుగా మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించవచ్చని ఎమ్మెల్సీ తక్కళ్ళపల్లి రవీందర్రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ప్రెషర్స్ డే వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సంద ర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ప్రిన్సిపల్ పొక్కుల సదానందం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ రవీందర్రావు మాట్లాడుతూ 302 మంది విద్యార్థులతో జిల్లాలోనే అడ్మిషన్లలో బాలికల జూనియర్ కళాశాల ముందుండడం విశేషం అన్నారు. అడ్మిషన్ల లో అగ్రభాగాలను నిలిచిన కళాశాల విద్యార్థులు అదే రీతిలో చక్కగా చదువుకొని అత్యున్నత మార్కులతో కావాలని ఆకాంక్షించారు. చదువుకు పేద ధనిక భేదం లేదని, చదువుతూనే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడి యట్ విద్యాధికారి మదార్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, టిగ్లా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నయీమ్ పాషా, బాలుర కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ గణేష్, నాగేందర్, అధ్యాపకులు పర్వీన్ బేగం, సాధిక్ అలీ, శ్రీనివాస్, రవి కిరణ్, రియాజ్, సురేందర్, నవీన్, కిరణ్ కుమార్, స్వాతి తదితరులు పాల్గొన్నారు.