15-09-2025 07:23:39 PM
కేటీఆర్ వి తప్పుడు ఆరోపణలు..
బిఆర్ఎస్ ది శవాలపై పేలాలు ఏరుకునే వ్యవహారం
రైతులు యూరియాను స్టాక్ పెట్టుకోవద్దు
నల్లగొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): యూరియా పక్కదారి పట్టిందనడంలో వాస్తవం లేదని నల్లగొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి(MP Kunduru Raghuveer Reddy) తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల సంక్షేమాన్ని మరిచి కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బిఆర్ఎస్ నాయకులు శవాలపై పేలాలు ఏరుకునే విధంగా రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. బిఆర్ఎస్ నాయకులు ప్రతి చిన్న విషయంపై రాజకీయం చేయడం సిగ్గుచేటు అన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయించాం. అధికారుల నివేదికలో నిజం లేదని తేలిందని చెప్పారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే ఆదేశానుసారమే యూరియాను కుక్కడం గ్రామానికి పంపించడం జరిగిందనీ ఆన్నారు. యూరియాను ఎమ్మెల్యే గన్ మెన్ తప్పుదోవ పట్టించారన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. రబీ లోను యూరియాకు ఎటువంటి లోటుండదని, రైతులు కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు. యూరియాను కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వనికి అందిస్తుందని, తెలంగాణలోనే కాకుండా బిజెపి పాలించే రాష్ట్రాలలో కూడా యూరియా సమస్య ఉందన్నారు.
ఎన్డీఏ భాగస్వామమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పంలోను రైతులు యూరియా కోసం రైతులు లైన్ కట్టారని తెలిపారు. నల్లగొండ జిల్లాలో కలెక్టర్ సారధ్యంలో కట్టుదిట్టమైన పర్యవేక్షణలో యూరియా సరఫరా జరుగుతుందనీ ఎలాంటి అవకతవకలకు తావు లేదని పేర్కొన్నారు. జిల్లాలో ఈ సీజన్లో గత ప్రభుత్వం57 వేల మెట్రిక్ టన్నుల యూరియా కొనుగోలు చేస్తే చ మా ప్రభుత్వంలో 61 వేల మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందించామన్నారు. ఇప్పటికే 4 వేల మెట్రిక్ టన్నులు అదనంగా పంపిణీ చేశామని ఇంకా 1300 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా త్వరలో నే 600 మెట్రిక్ పనుల యూరియా అందిస్తామన్నారు. జిల్లాలో రైతులు ఇప్పటికే రబీ పంటకు కూడా నిల్వ ఉంచుకోవడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. రైతులు యూరియాను స్టాకు పెట్టుకోవద్దని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలకు రైతులపై చిత్తశుద్ధి ఉంటే అధికార యంత్రాంగం వద్దకు వెళ్లి మాట్లాడాలని సూచించారు. ఈ సమావేశంలో నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి వంగూరు లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.