రూ. 312.42 కోట్లతో నగరపాలక సంస్థ బడ్జెట్
కరీంనగర్, మార్చి 31 (విజయక్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ 2026-2027 ఆర్థిక సంవత్సర బడ్జెట్ 312.42 కోట్లతో 11 ఎజెండా అంశాలకు పాలకవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. మంగళవారం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో మేయర్ కొలగాని శ్రీనివాస్ అధ్యక్షతన, కమీషనర్ ప్రఫుల్ దేశాయ్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు సమక్షంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ... కరీంనగర్ నగరాన్ని రాష్ట్రంలోనే ఒక ఆదర్శ నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మా పాలకవర్గం పని చేస్తుందని తెలిపారు. నగరపాలక సంస్థ అభివృద్ధి కొసం 312 కోట్ల బడ్జెట్ ను ప్రవేశ పెట్టి పాలకవర్గ సభ్యుల సమక్షంలో ఆమోదం తెలిపామన్నారు. ప్రవేశ పెట్టిన బడ్జెట్ నగర ప్రజల ఆకాంక్షకు... అభివృద్ధి లక్యాలకు ప్రతి రూపమన్నారు. డివిజన్ల వారిగా సభ్యులు సభ దృష్టికి తెచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించి... విలీన గ్రామాల డివిజన్ల తో పాటు అన్ని డివిజన్లను సమాంతరంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ సునీల్ రావు, పాలకవర్గ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.




