02-08-2025 02:04:38 AM
ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి, ఆగస్టు01 (విజయ క్రాంతి), కామారెడ్డి జిల్లాలో మహిళా పోలీసులతో కూడిన బ్లూ కోల్ విధులను ఐదు పోలీస్ స్టేషన్లలో అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. శుక్రవారం జెండా ఊపి మహిళా బ్లూ కోర్ట్ విధులను ప్రారంభించారు. కామారెడ్డి జిల్లాలో మొదటి దశలో మహిళ కానిస్టేబుల్ బ్లూకోర్టు విధులు నిర్వర్తించేందుకు కామారెడ్డి, దేవనపల్లి, బిక్కనూర్, బాన్సువాడ, ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ల లను ఎంపిక చేసినట్లు తెలిపారు.
మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్న నేటి తరుణంలో, ఈ శక్తి వనరులను పరిపూర్ణంగా వినియోగించేందుకు ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం బ్లూకోల్ట్ విధులు నిర్వహించే మహిళా పోలీసులతో స్వయంగా ఎస్పీ మాట్లాడారు.
ముందస్తుగా స్వీయ రక్షణ పాటిస్తూ హెల్మెట్ ధరించి వాహనం జాగ్రత్తగా నడుపుతూ నేర నియంత్రణకు, డయల్ 100 కాల్కు తక్షణ స్పందించవలసి ఉంటుందని అన్నారు, ధైర్యంగా విధులను నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె. నరసింహారెడ్డి, ఏఎస్పీ చైతన్య రెడ్డి (కామారెడ్డి), కామారెడ్డి, సదాశివనగర్ ఇన్స్పెక్టర్లు నవీన్, కృష్ణ, సంతోష్ కుమార్ (రిజర్వ్ ఇన్స్పెక్టర్) పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.