30-05-2025 01:17:55 AM
జగిత్యాల అర్బన్, మే 29 (విజయక్రాంతి): నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో 2 జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవల నిజామాబాద్ ఎంపీ అర్వింద్, ఎట్టి పరిస్థితుల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించాలని నవోదయ అధికారులను ఆదేశించారు.
ఇందులో భాగంగా విద్యాలయాల శాశ్వత, తాత్కాలిక స్థలాలకు సంబంధించి అవసరమైన చర్యలు ప్రారంభించాలని నవోదయ విద్యాలయ సమితి డిప్యూటీ కమిషనర్ గోపాలకృష్ణ కు లేఖ రాశారు. జగిత్యాల జిల్లాలో శాశ్వత భవన నిర్మాణానికి కోరుట్ల మండల శివారులో గల సర్వేనెంబర్ 923 లో, తాత్కాలిక వసతి కొరకు కోరుట్ల పట్టణంలోని అన్నమయ్య గుట్టలో గల బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్ కాలేజ్ మరియు సోషల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్ ఎంపిక చేయడం జరిగిందని ఆయన లేఖలో పేర్కొన్నారు.
జిల్లా అధికారులతో సమన్వయం చేసుకొని ఎలాంటి వివాదాలు లేని కోరుట్ల శివారులోని 30 ఎకరాల భూమి నవోదయ విద్యాలయ సమితి పేరుపై బదలాయింపు చేసుకోవాలని సూచించారు. ఈ విద్యా సంవత్సరం నుండి విద్యాసంస్థ తాత్కాలిక భవనంలో ప్రారంభమయ్యేందుకు అవసరమైన మరమ్మతుల పనుల స్థితిపై నివేదిక అందజేయాలని జవహర్ నవోదయ విద్యాలయ చొప్పదండి (కరీంనగర్) ప్రిన్సిపాల్ను ఆదేశించారు.