12 May, 2026 | 3:48 PM

విద్యార్థులకు భారీ షాక్: ప్రశ్నాపత్రం లీక్— దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రద్దు

12-05-2026 02:47 PM

న్యూఢిల్లీ: : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency), నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (అండర్ గ్రాడ్యుయేట్) 2026 పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సంవత్సరం NEET UG పరీక్ష కోసం 22.79 లక్షల మంది అభ్యర్థులు నమోదు చేసుకున్న నేపథ్యంలో మే 3, 2026న నిర్వహించిన NEET UG 2026 పరీక్షను రద్దు చేయాలని, అలాగే ఆ పరీక్షను తదనంతరం తెలియజేసే తేదీలలో తిరిగి నిర్వహించాలని భారత ప్రభుత్వ ఆమోదంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయించినట్లు అధికారిక ప్రకటన వెలువడింది. 

నీట్  యూజీ ప్రశ్న పత్రం లీక్ వార్తల నేపథ్యంలో కేంద్రం పరీక్ష రద్దుకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నీట్ ప్రశ్నపత్రం లీక్ పై కేంద్రం సీబీఐ దర్యాప్తనకు ఆదేశించింది. విద్యార్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ఎన్టీఏ ప్రకటించింది. రాజస్థాన్ లోని కోటాలో నీట్ యూజీ పశ్నాపత్రం లీకైనట్లు అధికారులు గుర్తించారు. కోటాలో కోచింగ్ సెంటర్లు ఇచ్చిన మెటీరియల్ తో పోలిఉన్నట్లు గుర్తించారు. కెమిస్ట్రీలో 120కి పైగా ప్రశ్నలతో ఉన్న ఓ ప్రాక్టీసు పేపర్ వెలుగులోకి వచ్చింది. ప్రశ్నాపత్రం లీకైనట్లు రాజస్థాన్ అదనపు డీజీపీ విశాల్ బన్సల్ వెల్లడించారు. పరీక్షకు 42 గంటల ముందు వాట్సప్ లో మెటీరియల్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. రాజస్థాన్ లోని సికార్ లో ఈ మెటీరియల్ అందుబాటులోకి వచ్చినట్లు గుర్తించారు. విద్యార్థులకు రూ. 20 వేల నుంచి రూ. 2 లక్షలకు విక్రయించారని అదనపు డీజీపీ వివరించారు. కొందరు అభ్యర్థుల నుంచి ముందగానే రూ. 30 వేలకు పైగా వసూలు చేశారని అధికారులు గుర్తించారు. దర్యాప్తు సంస్థలతో ఎన్ టీఏ కలిసి పనిచేస్తున్నామని ప్రకటించింది.

NTA మే 6న NEET UG తాత్కాలిక జవాబు కీని (provisional answer key) విడుదల చేసింది. అధికారిక గణాంకాల ప్రకారం, భారతదేశంలోని 551 నగరాల్లో, విదేశాల్లోని 14 నగరాల్లో, 5,432కు పైగా కేంద్రాల్లో సుమారు 22.79 లక్షల మంది నమోదిత అభ్యర్థుల కోసం ఈ పరీక్ష నిర్వహించబడింది. దీనితో NEET UG ప్రపంచంలోనే అతిపెద్ద ప్రవేశ పరీక్షలలో ఒకటిగా నిలిచింది. పరీక్షా కేంద్రాల వద్ద స్వతంత్ర పర్యవేక్షణ కోసం 6,000 మందికి పైగా పరిశీలకులను నియమించినట్లు NTA ఇంతకుముందు ఒక పత్రికా ప్రకటన ద్వారా తెలియజేసింది. NEET UG 2026 పరీక్ష సజావుగా జరిగేలా చూడటానికి రెండు లక్షల మందికి పైగా సిబ్బందిని మోహరించారు.