31 March, 2026 | 2:40 AM

జిల్లాలో ఎన్‌ఎఫ్‌బీఎస్ అమలు నిర్లక్ష్యం

31-03-2026 12:34 AM
  1. అర్హులైన కుటుంబాలకు అందని సాయం 

రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కొండల్రెడ్డి

సంగారెడ్డి, మార్చి 30(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లాలో నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ (ఎన్‌ఎఫ్బీఎస్) అమలు పరిస్థితి తీవ్రంగా నిరాశ కలిగిస్తున్నదని రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కమిటీ సభ్యుడు బి.కొండల్ రెడ్డి, రైతు స్వరాజ్య వేదిక సంగారెడ్డి జిల్లా నాయకురాలు ఆర్.లక్ష్మి, దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ నుంచి చుక్కమ్మ, మొగులమ్మ, సూర్యకళ తెలిపారు. సోమవారం వారు జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు.

కుటుంబంలో ప్రధాన ఆర్జనదారుడు మరణించినప్పుడు ఆర్థికంగా బలహీన వర్గాలకు సహాయం అందించేందుకు ఉద్దేశించిన ఈ కీలక పథకం సంగారెడ్డి జిల్లాలో సరైన విధంగా అమలు కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. లభ్యమైన సమాచారం ప్రకారం సంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు కేవలం 15 మంది లబ్ధిదారులకు మాత్రమే ఎన్‌ఎఫ్బీఎస్ కింద సహాయం అందింది.

ఈ సంఖ్య చాలా తక్కువగా ఉండి, అమలు విధానంపై అనేక సందేహాలను రేకెత్తిస్తోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 14,000 మంది లబ్ధిదారులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందగా, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్ఫ్) సమాచారం ప్రకారం ప్రతి జిల్లాలో సుమారు 1,000 అర్హత కుటుంబాలకు ఈ పథకం ప్రయోజనం అందించే అవకాశం ఉంది.

ఇలాంటి పరిస్థితుల్లో సంగారెడ్డి జిల్లాలో ఇంత తక్కువ సంఖ్యలో లబ్ధిదారులు ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ సమస్యపై పలుమార్లు సంబంధిత అధికారులకు వినతులు అందజేయడం, ప్రత్యక్షంగా కలుసుకుని ఫాలోఅప్ చేయడం జరిగినప్పటికీ, ముఖ్యంగా జహీరాబాద్ ప్రాంతంలో ప్రయత్నాలు చేసినప్పటికీ, ఎటువంటి గణనీయమైన పురోగతి కనిపించలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా పరిపాలన అధికారులు తక్షణమే స్పందించి అర్హులైన కుటుంబాలను గుర్తించి ఎన్‌ఎఫ్బీఎస్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.