13-01-2026 11:12:35 AM
సంగారెడ్డి,(విజయక్రాంతి): సంగారెడ్డి పట్టణంలోని శాంతినగర్ కాలనీలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది. గత మూడు నాలుగు రోజులుగా మోరీలు పూడికతో నిండిపోయి, మురుగు నీరు రోడ్లపైకి వచ్చి చేరుతోంది. కాలనీ అంతా దుర్వాసనతో అట్టుడికిపోతుండగా, మున్సిపల్ యంత్రాంగం మాత్రం మొద్దు నిద్రలో ఉందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మురికి నీటిలోనే స్కూలు చిన్నారుల ప్రయాణం
అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే, మురుగు నీరు ప్రవహిస్తున్న రోడ్డుపైనే పాఠశాల ఉండటంతో చిన్న పిల్లలు ఆ మురికిలోనే నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు ప్రభుత్వం స్వచ్ఛత గురించి గొప్పలు చెబుతున్నా, కనీసం పాఠశాల వెళ్లే దారిని కూడా శుభ్రంగా ఉంచలేకపోవడం అధికారుల అసమర్థతకు నిదర్శనమని స్థానికులు మండిపడుతున్నారు. నిలిచి ఉన్న నీటితో దోమలు పెరిగి చిన్నారులు డెంగ్యూ, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదం పొంచి ఉంది. తక్షణమే అధికారులు స్పందించి దీనికి శాశ్వత పరిష్కారం చేయాలని స్థానికులు కోరుతున్నారు.