03-12-2024 02:53:35 AM
హైదరాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): రాష్ర్టంలో కొత్తగా ఏర్పాటైన చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) గుర్తింపు లేకుండా నడుస్తున్నది. ఇప్పటివరకు యాక్ట్ను రూపొందించకపోవటంతో ఈ వర్సిటీ యూజీసీ గుర్తింపును పొందలేదు. దీంతో ఈ విశ్వవిద్యాలయంలోని విద్యార్థుల భవిష్యత్తుపై సందిగ్ధత నెలకొన్నది. కోఠి మహిళా కాలేజీని తెలంగాణ విమెన్ వర్సిటీగా అప్గ్రేడ్ చేస్తూ గత ప్రభుత్వం జీవోను జారీ చేసింది.
అప్పట్లో తెలంగాణ మహిళా యూనివర్సిటీగా నామకరణం చేశారు. ఏప్రిల్లో జీవోను సైతం జారీ చేయడంతో విద్యార్థులకు ఉస్మానియా యూనివర్సిటీ పేరు మీదే సర్టిఫికెట్లు జారీచేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పేరును వీరనారి ఐలమ్మ మహిళా వర్సిటీగా మార్చి ఇన్చార్జి వీసీగా ప్రొఫెసర్ సూర్యాధనుంజయ్ను నియమించారు. ఇంతచేసి ఏడాది గడిచినా యాక్ట్ను రూపొందించకపోవడంతో వర్సిటీ యూజీసీ గుర్తింపునకు నోచుకోలేకపోయింది.
ఏ పేరుతో ఇవ్వాలి?
ఈ వర్సిటీలో విద్యాభ్యాసం పూర్తిచేసుకున్న వారికి ఏ పేరుతో సర్టిఫికెట్లు జారీ చేయాలన్న అంశంపై సందిగ్ధిత నెలకొన్నది. కోఠి మహిళా కాలేజీ పేరు మీద ఇవ్వాలా? తెలంగాణ మహిళా వర్సిటీ పేరు మీద ఇవ్వాలా? వీరనారి చిట్యాల ఐలమ్మ మహిళా వర్సిటీ పేరు మీద ఇవ్వాలా? అన్న ప్రశ్నలు విశ్వవిద్యాలయ అధికారులను పీడిస్తున్నాయి.
దీనిపై స్పష్టత ఇవ్వాలని వర్సిటీ వర్గాలు ప్రభుత్వాన్ని కోరగా.. ఈ అంశంపై సర్కారు ఉన్నత విద్యామండలి న్యాయసలహాను కోరింది. అయితే ఈ విషయంపై విద్యామండలి త్వరలోనే ఓ నివేదికను రూపొందించి ప్రభుత్వానికి ఇవ్వనుంది. కాగా యాక్ట్ లేకపోవడంతో కోఠి మహిళా కాలేజీ పేరుతోనే విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ చేసే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి.