03-12-2025 12:00:00 AM
-వరి పంట ఉత్పత్తిలో నంబర్ వన్
-పంజాబ్ను దాటేసిన తెలంగాణ
-రెండేళ్లుగా స్థిరంగా వ్యవసాయ రంగం వృద్ధి
-రైతు సంక్షేమానికి రూ.లక్ష కోట్లకు మించి ఖర్చు
హైదరాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి) : ప్రభుత్వ ప్రోత్సాహంతో వ్యవసా య రంగం ఏటేటా వర్ధిల్లుతోంది. రాష్ర్టంలో పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. గడిచిన రెండేండ్లలో దేశంలోనే పంటల సాగులో తెలంగాణ సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలో అగ్రగామిగా నిలిచింది.
దిగుబడిలో పంజాబ్ను దాటేసింది. రాష్ర్ట స్థూల ఉత్పత్తి విలువలో (జీఎస్వీఏ ) వ్యవసాయం వాటా 6.7 శా తం పెరిగింది. ప్రస్తుత ధరల ప్రకారం వ్యవసాయ రంగం వాటా గత ఏడాది రూ.1,00, 004 కోట్లు నమోదుకాగా, 2024 25 అంచనాల ప్రకారం రూ. 1,06,708కు చేరిం ది. గతంతో పోలిస్తే ఈ ఏడాది పత్తి పంట ఉత్పత్తి 3.89 లక్షల టన్నులు పెరిగింది.
25 లక్షల రైతులకు రుణ విముక్తి..
తెలంగాణ రైతులను దేశానికే ఆదర్శంగా నిలబెట్టాలనే సంకల్పంతో రూ.లక్ష కోట్లకుపైగా ఖర్చు చేసింది. రూ.54280 కోట్లతో వివిధ పథకాలను అమలు చేసింది. రాష్ర్టంలోని రైతులకు ఒకే సారి రూ. 2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేసింది. దాదాపు 25 లక్షల (25,35,964) రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేసింది. అదే విధంగా రైతుకు ఆపద వస్తే రైతు కుటుంబాలు ధీమా గా ఉండేలా రైతు బీమాను ప్రభుత్వం అమ లు చేసింది.
ఇందులో భాగంగా రైతు లు ఏ కారణంతో మరణించినా రూ. 5 లక్ష ల బీమా పరిహారం ఆ బాధిత కుటుంబానికి అందిస్తోంది. 42.16 లక్షల మంది రైతుల కుటుంబాల పేరిట ప్రభుత్వం జీవిత బీమా కంపెనీకి రైతు బీమా ప్రీమియం చెల్లించింది. వ్యవసాయానికి సంబంధించి గత ప్రభుత్వం నిలిపేసిన 16 కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ర్ట ప్రభుత్వం పునరుద్ధరించింది.
రైతులు నష్టపోకుండా ..
రైతులు దళారుల చేతిలో మోసపోకుం డా రాష్ర్ట ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను కట్టుదిట్టంగా నిర్వహించింది. రైతులు నెలలకొద్దీ ఎదురు చూడకుండా డబ్బులను వేగం గా చెల్లించి రికార్డు నెలకొల్పింది. ప్రస్తుత సీజన్లో 8,380 కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటికే 38.72 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది.
ఇప్పటి వరకు (డిసెంబర్ 2వ తేదీ) దాదాపు రూ.10162 కోట్ల ధాన్యం. సెంటర్లలో ధాన్యం అమ్మిన రైతులకు రెండు రోజుల్లోనే డబ్బులు చెల్లిస్తోంది. ఈ సీజన్లో ఇప్పటికే సన్నాలు అమ్మిన రైతులకు రూ.314 కోట్ల బోనస్ చెల్లించింది. రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ధరణి వెబ్ పోర్టల్ను రద్దు చేసి.. రైతులకు తమ భూములపై హక్కులు కల్పించే భూభారతి చట్టం అమల్లోకి తెచ్చింది.
నాణ్యమైన విత్తనాలు అందించేందుకు సీడ్ యాక్ట్
రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించేందుకు ప్రత్యేకంగా తెలంగాణ సీడ్ యాక్ట్ను తీసుకురావాలని ప్రభు త్వం నిర్ణయించింది. మే నెలలోనే ఈ బిల్లు ముసా యిదా తయారీకి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.
మెరుగైన విత్తనాలను పండించడం, స్థానికంగా అవసరం మేరకు వాడుకొని, మిగిలిన వాటిని ఎగుమతి చేసే స్థాయికి రైతులు ఎదిగేలా ఈ బిల్ ఉపయోగపడనుంది. గత ఏడాది మార్చి, సెప్టెంబర్లో వడగం డ్లు, వర్షాలతో నష్టపోయిన 94,462 మంది రైతులకు రూ.95.39 కోట్ల పరిహారం అందించింది. ఇటీవల మార్చి, ఏప్రిల్లో వచ్చిన భారీ వర్షాలకు నష్టపోయిన 36,449 మంది రైతులకు రూ. 44.19 కోట్ల పరిహారం అందించింది.