ఐటీసీ పీఎస్పీడీలో నూతన వేతనాలు తక్షణమే అమలు పరచాలి
బూర్గంపాడు, జూన్23 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన నూతన వేతన జీవోను తక్షణమే అమలు పరచాలని డిమాండ్ చేస్తూ ఐటీసీ పీఎస్పీడీ యాజమాన్యానికి వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర కనీస వేతన మండలి సభ్యుడు, ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి యారం పిచ్చిరెడ్డి ఆధ్వర్యంలో ఐటీసీ యాజమాన్య ప్రతినిధులను కలిసి ఈ వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా యారం పిచ్చిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం పెరిగిన దైనందిన జీవన వ్యయాల భారంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్మికుల కష్టాలను గుర్తించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్, తెలంగాణ రాష్ట్ర మినిమమ్ వేజ్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ల మార్గదర్శకత్వంలో ప్రభుత్వం జీవో నంబర్ 6 ను విడుదల చేసిందని గుర్తుచేశారు.ఈ నూతన ఉత్తర్వుల ప్రకారం, కోడ్ ఆన్ వేజెస్ 2019, షెడ్యూల్-I, ఎంప్లాయ్మెంట్’ లో పేర్కొన్న నూతన కనీస వేతన రేట్లు జూన్ 1, 2026 నుండి రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి వచ్చాయని ఆయనn స్పష్టం చేశారు.
పాత వేతన నోటిఫికేషన్లు అన్నీ రద్దయినందున.. ప్రభుత్వం కల్పించిన ఈ కొత్త వేతన సౌకర్యాన్ని ఐటీసీ లిమిటెడ్- పీఎస్ పీడీ భద్రాచలం యూనిట్ లోని బదిలీ, కాంట్రాక్ట్ కార్మికులకు తక్షణమే వర్తింపజేయాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల శ్రమకు తగిన న్యాయమైన వేతనాలతో పాటు, చట్టబద్ధంగా అందవలసిన ఇతర సౌకర్యాలను కూడా సకాలంలో అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ ఐటీసీ విభాగం అధ్యక్షులు గోనే రామారావు, పలువురు కార్యవర్గ సభ్యులు,ఐఎన్టీయూసీ నాయకులు,కార్యకర్తలుకార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






