04-08-2025 01:18:45 PM
మునుగోడు,(విజయక్రాంతి): మునుగోడు నియోజకవర్గంలో చెరువులను కబ్జా చేస్తే ఊరుకునేది లేదని చెరువు విస్తీర్ణాన్ని సర్వే చేసి కబ్జాదారులకు నోటీసులు జారీ చేయాలని సంబంధిత అధికారులతో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. సోమవారం మునుగోడు పట్టణాన్ని అనుకొని ఉన్న పెద్ద చెరువును మార్నింగ్ వాక్ చేసుకుంటూ, 395 ఎకరాలు ఉన్న పెద్ద చెరువు మొత్తం కబ్జాకు గురైందని స్థానిక నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగ పెద్ద చెరువును, చెరువు కట్ట ను, అలుగు ను పరిశీలించి మాట్లాడారు.
చెరువులు నిండుగా ఉంటే జీవజాతులు సంతోషంగా ఉంటాయని జీవజాతులన్నీ ఉన్నచోట జీవై వైవిధ్యం ఉట్టి పడుతుందన్నారు.తహసిల్దారు, సర్వేయర్ స్థానిక ఎంపీడీవోలతో కలిసి కట్ట మీదే రెవెన్యూ మ్యాప్ ను పరిశీలించారు. రెవిన్యూ రికార్డుల ప్రకారం రెవెన్యూ మ్యాప్ ప్రకారం చేపట్టాల్సిన పనులను అధికారులకు సూచించారు.మొత్తంగా ఎంగేజ్మెంట్ సర్వే నిర్వహించి చెరువు కబ్జాకు గురైతే ఆ కబ్జా చేసిన వారికి నోటీసులు పంపించి చెరువు బార్డర్స్ ఫిట్ చేయాలన్నారు.
చెరువు కట్టను మరమ్మతులు చేసి వెడల్పు చేయాలన్నారు. చెరువు లోపలి భాగం వరకు లోతుగా మట్టిని తొలగించి చెరువు నిండుగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.. రాబోయే కాలంలో చెరువులను సుందరీకరణ చేస్తామని నల్గొండ రోడ్డు నుండి నార్కెట్పల్లి రోడ్డు వరకు కట్టమీదగా రోడ్డు వెడల్పు పనులు కూడా చేపడుతామని అన్నారు.. చెరువు ల్యాండ్ తో పాటు ఎఫ్డిఎల్ ల్యాండ్ ఎంత ఉంది అనేది కూడా నివేదిక సమర్పించాలని స్థానిక తాసిల్దార్ కి ఆదేశించారు.