23-02-2026 12:57:12 AM
కిడ్నాప్ కేసులో కలకలం
అబ్దుల్లాపూర్ మెట్, ఫిబ్రవరి 22( విజయక్రాంతి ):ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రాజకీయ సెగలు మరో సారి రాజుకున్నాయి. కౌన్సిలర్ నక్క యాదగిరి కిడ్నాప్ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఆయన కుమారుడు ప్రశాంత్ రెడ్డిలకు ఇబ్రహీంపట్నం పోలీసులు నోటీసులు జారీ చేయడం స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. మున్సిపల్ ఎన్నికల చైర్మన్ విషయంలో ఇటీవల కౌన్సిలర్ నక్క యాదగిరి కిడ్నాప్కు గురయ్యారనే ఆరోపణలపై పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. కిడ్నాప్ కేసుకు సంబంధించిన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు వెళ్లగా, నిందితులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఎలిమినేడులోని కిషన్ రెడ్డి నివాసానికి నోటీసులను అంటించారు. అలాగే హైదరా బాద్లోని తిరుమల హిల్స్ నివాసంలో కూడా నోటీసులు అందజేసినట్లు సమాచారం.
నోటీసులు అందిన మూడు రోజుల్లోగా విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని పోలీసులు స్పష్టం చేశారు. నిర్ణీత గడువులోగా స్పందించకపోతే చట్టపరమైన తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. రాజకీయ ఉత్కంఠ..... తండ్రీకొడుకులకు ఒకేసారి పోలీసు నోటీసులు అందడంతో ఇబ్రహీంపట్నం రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ కిడ్నాప్ వెనుక అసలు కారణాలు ఏంటి? దీని వెనుక ఉన్న రాజకీయ కోణాలు ఏమిటనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.