calender_icon.png 15 June, 2025 | 12:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోషకాల ఇప్పపూల లడ్డూలు

15-06-2025 01:07:21 AM

ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ మహిళలు ఇప్ప పూలతో తయారు చేస్తున్న లడ్డూలకు డిమాండ్ పెరుగుతున్నది. ఈ లడ్డూలో అధిక పోషకాలు ఉండటంతో జోరుగా అమ్మకాలు సాగుతున్నాయి. రాష్ట్ర సచివాలయంలోని క్యాంటీన్ నుంచి ఈ లడ్డూలు కావాలని ఆర్డర్లు కూడా వస్తున్నాయి. ఇప్పపూల లడ్డూలే కాకుండా ఇప్ప గారెలు, ఇప్ప గట్కా, ఇప్ప అంబలి సహా ఇప్పపువ్వు మిశ్రమంతో తయారు చేస్తున్న ఆహారపదార్థాలకు డిమాండ్ పెరుగుతున్నది. ప్రధాని మోదీ కూడా ఇప్పపూల లడ్డూలు, వాటిని తయారు చేస్తున్న మహిళలను మన్‌కీ బాత్ కార్యక్రమంలో ప్రశంసించడం గమనార్హం. 

ఆదిలాబాద్ అంటేనే ఎక్కువగా ఆదివాసీలు నివసించే అడవుల జిల్లాగా పేరుంది. ఇక్కడి అడవుల్లో ఎన్నో పోషకాలు కలిగిఉండే వివిధ రకాల ప్రకృతి సంపదకు కొదవలేదు. కాలం ఏదైనా సరే అడవుల్లో లభించే సహజ సిద్ధమైన ప్రకృతి సంపదతో ఆదివాసీలు ఉపాధి పొందుతుంటారు. అం దులో ఇప్ప పువ్వు ఒకటి. ఉమ్మడి ఆదిలాబా ద్ జిల్లాలోని అడవుల్లో విరివిగా లభించే ఇప్పపువ్వు ఆర్థికంగా వెనుకబడిన ఆదివాసీల జీవనోపాధికి, ఆర్థిక ప్రగతికి ఊతమిస్తోంది.

వేసవి కాలంలో విరివిగా లభించే ఈ ఇప్ప పువ్వును సేకరించి ఇక్కడి ఆదివాసులు ఉపాధిని పొందేవారు. ఇపుడు ఆ ఇప్పపువ్వుకు మరింత విలువలను జోడించి విక్రయించడం ద్వారా ఏడాది పొడవునా ఉపాధి మార్గం సుగమం చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఇప్పపువ్వు అంటే బలవర్ధకమైన పోషకాహారంగా ప్రసిద్ధి పొందింది.

ఇప్పపూలకు పల్లీలు, నువ్వు లు, జీడిపప్పు, కిస్మిస్‌లు, బాదంల మిశ్రమం తో పాటు బెల్లం పానకం జోడించి ఆదివాసి మహిళలు తయారు చేస్తున్న ఇప్పపూల లడ్డూలు రక్త హీనతను తగ్గించడంతో పాటు పోషకాలను పెంచటానికి దోహదపడుతుంది.

వీటి గురించి ఇటీవల ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించడంతో ఆదిలాబాద్ జిల్లాలో తయారవుతున్న ఇప్ప లడ్డూల ఖ్యాతి మరింత పెరిగింది. తాజాగా ‘గిరిజన మహువా లడ్డూ’ పేరుతో  తయారవు తున్న ఇప్పపువ్వు లడ్డూలకు రాష్ట్ర సచివాలయంలోని క్యాంటీన్ నుంచి సైతం ఆర్డర్లు వస్తున్నాయి. 

మహిళా సంఘాలకు ప్రోత్సాహం

ఆదిలాబాద్ జిల్లాలో అధికారులు మహి ళా సంఘ సభ్యులకు రుణం ఇచ్చి ఇప్పపువ్వు లడ్డుల తయారీలో శిక్షణ ఇప్పించి వారి స్వయం ఉపాధికి మార్గం చూపుతూ ప్రోత్సహిస్తున్నారు. మొదటిసారిగా 2019 లో అప్పటి కలెక్టర్ ప్రోత్సాహంతో 12 మం ది మహిళలు సహకార సంఘంగా ఏర్పడి ఉ ట్నూరులో ఇప్పపువ్వు లడ్డూలను తయారు చేసి ఉపాధిని పొందుతున్నారు.

తాజాగా ప్రస్తుత కలెకర్ రాజార్షిషా ప్రోత్సాహంతో నార్నూరు మండలం ఖైర్ దాట్వా గ్రామానికి చెందిన ఆదివాసి మహిళలు సైతం ఓ సంఘంగా ఏర్పడి గిరిజన మహువా లడ్డూ పేరుతో ఈ ఇప్పపువ్వు లడ్డూల తయారీని మొదలు పెట్టారు. వీరు తయారు చేసిన ఇప్పలడ్డూలకు మంచి ఆదరణ లభిస్తోంది. హైదరాబాద్‌లోని సచివాలయంలో ఏర్పా టు చేసిన క్యాంటీన్ నుంచి వీరికి ఆర్డర్లు వస్తున్నాయి. వారానికి పది కిలోలు అక్కడికి పంపుతున్నారు. అలాగే స్థానికంగా అమ్ముడుపోతున్నాయి. 

ఇప్పపువ్వు మిశ్రమంతో పదార్థాలు

ఇప్పపూల లడ్డూలకు ఏజెన్సీ ప్రాంతంలో నే కాకుండా మైదాన ప్రాంతంలో మంచి డిమాండ్ ఏర్పడింది. కేవలం ఇప్పపూల లడ్డూలకే కాకుండా ఇప్పగారెలు, ఇప్ప గట్కా, ఇప్ప అంబలి సహా ఇప్పపువ్వు మిశ్రమంతో మరిన్ని ఆహార ఉత్పత్తుల తయారీకి రోజురోజుకు మరింత డిమాండ్ పెరుగుతోంది. ఇప్పపువ్వు అంటే కేవలం ఆదివాసీలు మాత్రమే తినే పదార్థాలుగా  ఇప్పటి వరకు చూసేవారు. కానీ ఇటీవల ఇప్ప పువ్వుతో కలి గే ప్రయోజనాలు తెలుసుకుని ప్రతి ఒక్కరు ఇప్ప పువ్వుతో తయారవుతున్న తినుబండారాలను ఉపయోగిస్తున్నారు. ఇలానే ఆదివాసీలకు సహకారం అందిస్తే ఆదివాసి గిరిజన మహిళల స్వయం ఉపాధికి మరింత భరోసా లభిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

 బీర్కూర్వార్ వెంకటేశ్, 

అదిలాబాద్ (విజయక్రాంతి) 

ప్రభుత్వం మరింత ప్రోత్సహించాలి 

మేము ఇప్పపువ్వుతో తయారు చేసే లడ్డూలు, గారెలు, బూరెలు ఇతరత్రా తినుబండారాలను  ఏజెన్సీ ప్రాంతంలో నే కాకుండా మైదానపు ప్రాంతంలో సైతం అమ్మేందుకు ప్రభుత్వం మరింత గా ప్రోత్సహించాలి. వీటితో ప్రజలకు పోషకాలు లభించడంతో పాటు మాలాంటి ఆదివాసీ మహిళలకు ఉపా ధి లభిస్తుంది. ఇటీవల ప్రధాని మోదీ ఇప్పపువ్వుతో తయారు చేసిన లడ్డూల ను మనకి బాత్ కార్యక్రమంలో ప్రస్తావించడం మాలాంటి ఆదివాసీ మహిళ లను ఎంతగానో ఉత్సాహపరిచింది.  

 ఆత్రం కౌసల్యాబాయి, 

మహిళా సంఘం అధ్యక్షురాలు, 

ఖైర్‌దాట్వా