15-06-2025 01:03:37 AM
శిథిలావస్థకు చేరిన కాట్రపల్లి శివాలయం
మహబూబాబాద్ జిల్లా కాట్రపల్లి గ్రామంలో 12వ శతాబ్దంలో కాకతీయులు ఊరు, గుడి, చెరువు విధానం లో నిర్మించిన శివాలయం శిథిలావస్థకు చేరింది. ఆనాటి శిల్పసంపద కాలగర్భంలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రఖ్యాతిగాంచిన హనుమకొండ వేయిస్తంభాల దేవాలయం, రామప్ప దేవాలయాన్ని పోలిన విధంగా కాట్రపల్లి శివాలయంలో ఏకశిలతో రూపొందించిన శివలింగం, పానవట్టం, నందీశ్వరుడు, అద్భుతమైన నల్లరాతి విగ్రహాలు, ఆనాటి శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనంగా దేవాలయ ప్రాకా రం కలిగి ఉండడం ఇక్కడి విశేషం.
గ్రామం లో పలుచోట్ల ఆనాటి పాలనకు నిదర్శనంగా ఆనవాళ్లు ఉండడంతో పాటు మహబూబాబాద్ జిల్లాలోని అతిపెద్ద తటాకం కాట్రపల్లి లో ఉంది. శతాబ్దాల కాలంనాటి శివాలయం కొంత ఒరిగిపోయింది. దీంతో దేవాలయంలోకి వెళ్లడానికి ప్రజలు భయపడేవారు. గుర్తుతెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం గర్భగుడిలో, పరిసరాల్లో తవ్వకాలు జరిపా రు. 20 సంవత్సరాల క్రితం వరకు ఆలయంలోకి వెళ్లడం మానుకున్నారు.
కొందరు గ్రామస్థులు దేవాలయాన్ని వినియోగంలోకి తేవడానికి నడుం బిగించి, దాతల సహకారంతో ఆలయ పరిసరాలను శుభ్రం చేసి, గుప్త నిధుల కోసం తొలగించిన విగ్రహాలను, శివలింగాన్ని యథాస్థితికి చేర్చి శివకో టేశ్వరాలయంగా నామకరణం చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ప్రతి ఏటా శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అలాగే ప్రభుత్వం నుంచి 2010లో ధూపదీప నైవేద్య కార్యక్రమంలో దేవాలయాన్ని చేర్చారు.
ఆలయ నిర్వహణకు పూజారికి నిధులు విడుదల చేయించడంతో దేవాల యం భక్తులకు అందుబాటులోకి వచ్చింది. దేవాలయ పునర్నిర్మాణానికి సుమారు నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి అందించినప్పటికీ ఇప్పటికీ ఎలాంటి నిధు లు మంజూరు కాలేదు. ఫలితంగా చారిత్రకమైన కాట్రపల్లి శివాలయం, శిల్పసంపద కాలగర్భంలో కలిసిపోకుండా కాపాడాల్సిన బాధ్యత పురావస్తు శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ, ప్రభుత్వంపై ఉంది.
బండి సంపత్కుమార్
మహబూబాబాద్
దేవాలయాన్ని పరిరక్షించాలి..
వందల ఏండ్ల చరిత్ర ఉన్న కాకతీయుల కాలం నాటి అద్భుత శిల్పసౌందర్యంతో నిర్మించిన కాట్రపల్లి శివాలయాన్ని ప్రభుత్వం పరిరక్షించాలి. గ్రామస్థుల సహకారంతో 20 ఏళ్ల క్రితం తాత్కాలికంగా మరమ్మతులు నిర్వహించి వినియోగంలోకి తెచ్చాం. ప్రత్యేక శివరా త్రి వేడుకలను దాతల సహకారంతో ఘనంగా నిర్వహిస్తున్నాం. నాలుగు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో దేవాలయ పునర్నిర్మాణానికి ప్రతిపాదనలు సీఎం రేవంత్రెడ్డి సలహాదారుడు వేం నరేందర్రెడ్డికి అందించాం. నిధులను మంజూరు చేయాల్సి ఉంది. ప్రభుత్వం స్పందించి దేవాలయ పునర్నిర్మాణానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలి.
గుగులోతు దసృనాయక్, మాజీ సర్పంచ్, కాట్రపల్లి