22-12-2025 06:00:46 PM
నకిరేకల్,(విజయక్రాంతి): చందుపట్ల గ్రామాన్ని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా గెలుపొందిన దీగోజు లత–వెంకటాచారి, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్, పాలకవర్గ సభ్యులను ఎమ్మెల్యే శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీలకతీతంగా గ్రామాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో జవాబుదారీగా పనిచేయాలని నూతన పాలకవర్గానికి దిశానిర్దేశం చేశారు.చందుపట్ల గ్రామం నుంచి మండలపురం గ్రామం వరకు డబుల్ రోడ్డు విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని, గ్రామంలో బ్రిడ్జి నిర్మాణం, సీసీ రోడ్ల పనులను చేపట్టిమౌలికసదుపాయాలను మరింత బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. తాగునీరు, పారిశుధ్యం, డ్రైనేజీ, వీధి దీపాల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా పారదర్శకంగా అమలు చేయాలని పేర్కొన్నారు. అందరి సహకారంతో చందుపట్ల గ్రామాన్ని అభివృద్ధి బాటలో నిలబెట్టడమే లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.