మెప్మా రుణాల అవినీతిలో అధికారులదే కీలకపాత్ర
- రుణాల పేరుతో అమాయక మహిళలను మోసం చేశారు
బ్యాంకు అధికారుల పాత్ర కూడా ఉంది
ఐదు రోజుల్లో విచారణ పూర్తి చేస్తాం
జిల్లా ఆడిట్ అధికారి జయ శ్రీ
గజ్వేల్ మే 15: మెప్మా రుణాల అవినీతిలో గజ్వేల్ మెప్మా అధికారులు, రిసోర్స్ పర్సన్ ల కీలక పాత్ర ఉన్నట్లు విచారణ అధికారి, జిల్లా ఆడిట్ ఆఫీసర్ జయశ్రీ తెలిపారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ లోని మెప్మా మహిళా సంఘాలకు రుణాల మంజూరీలో జరిగిన అవకతవకలపై శ్యామల అనే మహిళ ఫిర్యాదుతో అడిషనల్ కలెక్టర్ గారిమ అగర్వాల్ ఆదేశాల మేరకు జిల్లా ఆడిట్ ఆఫీసర్ జయ శ్రీ గురువారం విచారణ ప్రారంభించారు.
మొదటిరోజు విచారణ పూర్తయిన అనంతరం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో విలేకరులతో ఆమె మాట్లాడారు. మహిళా సంఘాల్లోని అమాయక మహిళలను రుణాలు ఇప్పిస్తామని మోసం చేసి మెప్మా ఆర్పీలు అధికారులే ప్లాన్ ప్రకారంగా డబ్బులు కాజేసినట్లు అర్థమవుతుందన్నారు. మెప్మా అధికారులకు బ్యాంకు అధికారులకు కూడా సహకరించినట్లు తాము గుర్తించామన్నారు.
అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆదేశాల మేరకు మహిళా సంఘాల సభ్యులందరికీ జరిగిన అన్యాయంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి న్యాయం చేస్తామన్నారు. ఇప్పటివరకు తాము చేసిన విచారణలో అమాయకమైన మహిళలను ఆసరాగా చేసుకుని బ్యాంకుల నుండి రుణాలు ఇప్పించి ఆర్ పి తోపాటు మరొక మహిళ కూడా డబ్బులు కాదేశారని గుర్తించామన్నారు.
మరో నాలుగు రోజులపాటు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి మహిళా సంఘాల సభ్యులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఈ విచారణలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నరసయ్య, మెప్మా పీడీ హనుమంత్ రెడ్డి, అధికారులు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.




