29-09-2025 03:40:19 PM
కాటారం,(విజయక్రాంతి): ఆర్టీసీ బస్సు బైక్ ఢీకొన్న దుర్ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మహాదేవపూర్ మార్గమధ్యలో సోమవారం ఆర్టీసీ బస్సు లూన బైకు ఎదురెదురుగా ఢీకొన్నాయి. భూపాలపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (టీ ఎస్ 25 టీ 4668) హైదరాబాదు నుంచి కాలేశ్వరం వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో కాటారం గ్రామపంచాయతీ పరిధిలోని సబ్ స్టేషన్ పల్లెకు చెందిన మాచర్ల మల్లేశం (65) అనే కూరగాయల చిరు వ్యాపారి కి తీవ్ర గాయాలయ్యాయి. లూన బైక్ బస్సు టైర్ల కిందికి వెళ్లిపోగా నుజ్జు నుజ్జు అయ్యింది. మల్లేశంకు తలకు, భుజాలకు తీవ్ర గాయాలై , రక్తస్రావం జరగగా రోడ్డు అంతా రక్తం తో నిండి పోయింది. వెంటనే స్థానికులు 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. క్షతగాత్రుడిని అంబులెన్స్ లో భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వంద పడకల ప్రధాన ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.