25 July, 2026 | 1:44 AM

ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి

25-07-2026 12:32 AM

పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

బెల్లంపల్లి, జూలై 24: వివిధ కారణాల రీత్యా పోలీస్ స్టేషన్ లకు వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలనీ రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. శుక్ర వారం మంచిర్యాల తాండూర్ సర్కిల్ కార్యాలయాన్ని వార్షిక తనిఖీల్లో భాగంగా మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ తో కలిసి సీపీ తనిఖీ చేశారు.

వార్షిక తనిఖీల్లో భాగంగా తాండూర్ సర్కిల్ కార్యాలయాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్ సర్కిల్ పరిధిలో నమోదైన గ్రేవ్ కేసులు, దర్యాప్తులో ఉన్న కేసుల సీడీ ఫైళ్లు, పెండింగ్ ట్రయల్ కేసులకు సంబంధించిన సీడీ ఫైళ్లను పరిశీలించారు. ముఖ్యంగా పోక్సో కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా నాణ్యమైన దర్యాప్తు నిర్వహించాలని సూచించారు. కేసుల దర్యాప్తులో నాణ్యతతో పాటు వేగం కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సిబ్బంది విధి నిర్వహణను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అవసరమైన మార్గదర్శకాలు అందించాలని తెలిపారు.

భూ వివాదాలకు సంబంధించిన ప్రతి ఫిర్యాదును నిష్పాక్షికంగా, నిజాయితీతో విచారించి, చట్టబద్ధంగా దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తులపై అనవసరంగా బలప్రయోగం చేయరాదని స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన మేరకే చట్టబద్ధమైన బలాన్ని వినియోగించాలని సూచించారు.

నేరాల నియంత్రణ కోసం రాత్రి వేళల్లో ప్రివెంటివ్ పెట్రోలింగ్, వాహనాల తనిఖీలు నిర్వహించాలని, సర్కిల్ పరిధిలోని రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు .వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచి ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాలని సూచించారు. ప్రతి సర్కిల్లో సమస్యలు తలెత్తక ముందే వాటిని గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

నేరాల దర్యాప్తులో వస్తున్న తాజా పరిణామాలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంపొందించుకోవాలని, ముఖ్యంగా ఎస్‌ఐ స్థాయి నుంచి పైస్థాయి అధికారులందరూ సీసీటీఎన్‌ఎస్, సమాచార సాంకేతికత (ఐటీ), ఆధునిక పోలీసింగ్లో వినియోగిస్తున్న సాంకేతిక వ్యవస్థలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. భవిష్యత్తులో సాంకేతికత వినియోగం మరింత పెరుగుతుందని, ప్రమోషన్లతో బాధ్యతలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి అధికారి తమ సాంకేతిక నైపుణ్యాలను (సాఫ్ట్ స్కిల్స్) అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ప్రతి పిటిషన్ను క్షుణ్ణంగా పరిశీలించి, ఫిర్యాదుదారుల వివరాలను సమగ్రంగా ధృవీకరించాలని తెలిపారు. బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, సీఐ దేవయ్య  ఉన్నారు.