15-06-2025 12:00:00 AM
- నేషనల్ పార్క్ వద్ద చిత్రహింసలు పెట్టి ఎన్కౌంటర్
- మారణ హోమానికి కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత
- అన్నపూర్లో అరెస్టు చేసిన 25మందిని కోర్టులో హాజరుపరచాలి
- మావోయిస్టు వెస్ట్ బస్తర్ డివిజన్ కమిటీ లేఖ
చర్ల, జూన్ 14: ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మారణహోమం సృష్టిస్తున్నాయని విమర్శిస్తూ మా వోయిస్టు వెస్ట్ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి మోహన్ పేరు మీదుగా లేఖ విడుదల చేశారు. శనివారం లేఖను విడుదల చేసింది. జూన్ 3న విష్ణుదేవ్ ప్రభుత్వం మూడు జిల్లాల నుంచి దళాలను మోహరించి నేషనల్ పార్క్ ప్రాంతంలో మావోయిస్టులను చిత్రహింసలు పెట్టి ఎన్కౌంటర్ చేయించారని లేఖలో పేర్కొన్నారు.
జూన్ 3 నుంచి జూన్ 9 వరకు జరిగిన ఈ మారణహోమం లో గౌతమ్ దాదా, భాస్కర్, లాల్సు, రజని, రైని, సంతోష్లను దారుణంగా హింసించి, ఎన్కౌంటర్ చేశారని ఆరోపించారు . అన్ని వర్గాల దోపిడీకి గురైన, అణచివేతకు గురైన ప్రజలు ఈ మారణహోమానికి వ్యతిరేకంగా తమ గొంతును వినిపించాలని విజ్ఞప్తి చేశా రు. ఈ ఏడుగురు ప్రముఖ కామ్రేడ్ల మరణం పట్ల పశ్చిమ బస్తర్ డివిజన్ కమిటీ విచారం వ్యక్తం చేస్తోందని పేర్కొన్నారు.
ఆపరేషన్ కగార్ పేరుతో అటవీ ప్రాంతంలో విప్లవాత్మక ఉద్యమాన్ని అంతం చేయడానికి, గిరిజ నులను నీరు, అడవి, భూమి నుంచి తరిమికొట్టడానికి, సహజ ఖనిజ సంపదను స్వదేశీ, విదేశీ కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ ఆపరేషన్ సమయంలో సమీపంలోని నదిలో చేపలు పట్టేందుకు వెళ్లిన అరపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు గ్రామస్తులను, అన్నపూర్ గ్రామానికి చెందిన 25 మందిని పోలీసులు అరెస్టు చేశారని, వారిని మీడియా ముందు హాజరుపరచలేదని పేర్కొన్నారు.
వారిని వెంటనే కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేశారు. ఎడపల్లి, ఇర్పగుట్ట, శిన్నకకలర్, బెడ్డకకలర్, అన్నపూర్, టెకమెట్ట అడవుల్లో పోలీసు దళాలు జరిపిన కాల్పులుతో ఈ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొందని, సమీప గ్రామాల ప్రజలు అడవుల్లో తిరగడం మానేశారని చెప్పారు. మేధా వులు, మానవ హక్కుల సంస్థలు, ప్రజా ప్రయోజన జర్నలిస్టులు, గిరిజన సంక్షేమ కార్యకర్తలు, నిరుద్యోగ విద్యార్థులు ఈ సంఘటనపై నిష్పాక్షిక దర్యాప్తు జరిపి ప్రపంచానికి ఈ సత్యాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు.