అవయవదానం ప్రాణదానం
- మెడికవర్, ఫ్రెండ్స్ ఫర్ యూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన
- హైటెక్ సిటీలోని మెడికవర్ హాస్పిటల్స్లో నిర్వహణ
హైదరాబాద్, ఆగస్టు 13(విజయక్రాంతి): అవయవదానంప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసి, మరింత మందిని ఈ మహోన్నత సేవలో భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో హైటెక్ సిటీ మెడికవర్ హాస్పిటల్స్, ఫ్రెండ్స్ ఫర్ యూ ఫౌండేషన్ సంయుక్తంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాయి. హైటెక్ సిటీలోని మెడికవర్ హాస్పిటల్స్ బ్లూ ప్లానెట్ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైద్య నిపుణులు, సామాజిక సేవకులు, యువత, వివిధ వర్గాల ప్రజలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ గణ్శ్యామ్ ఎం. జగత్కర్, డాక్టర్ గట్టు తరుణ్, డాక్టర్ దిండి అరుణ్ కుమార్ అవయవదానం, అవయవ మార్పిడి ప్రక్రియ, దాతల పాత్ర, అవయవాల కొరత వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఫ్రెండ్స్ ఫర్ యూ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు లోకేష్ అరుకాల యువతలో సామాజిక బాధ్యత పెంపొందించడం, అవయవదానంపై ఉన్న అపోహలను తొలగించడం ఎంత ముఖ్యమో వివరించారు. అవయవదానంపై ప్రత్యేక వీడియో ప్రదర్శనతో పాటు, అవయవదాన ప్రతిజ్ఞ కార్యక్రమం కూడా నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, అవయవదానం గురించి ఇంటి నుంచే చర్చలు ప్రారంభమవాలని, పాఠశాలలు, కళాశాలలు మరియు సమాజంలో విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. యువత పాల్గొంటే మరెన్నో ప్రాణాలను రక్షించవచ్చని తెలిపారు.భవిష్యత్తులో కూడా అవయవదానంపై మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి మెడికవర్ హాస్పిటల్స్ మరియు ఫ్రెండ్స్ ఫర్ యూ ఫౌండేషన్ కట్టుబడి ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు.






