25-08-2025 01:16:08 AM
వెలుగులోకి వస్తున్న చిత్రవిచిత్రాలు
పాట్నా, ఆగస్టు 24: బీహార్ ఓటర్ల జాబితాలో చిత్ర విచిత్రాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈసీ ప్రకటించిన ముసాయిదా జాబితాలో ఇద్దరు పాకిస్థాన్ జాతీయుల పేర్లు ఉన్నట్టు తెలుస్తోంది. 1950 సమయంలో భారత్లోకి ప్రవేశించిన ఇద్దరు పాకిస్థానీ మహిళలు బీహార్ ఓటర్లుగా నమోదు చేసుకున్నట్టు వెల్లడయ్యింది. దీనిపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దర్యాప్తు ప్రారంభించింది.
వీసా గడువు ముగిసిన తర్వాత కూడా దేశంలోనే ఉండిపోయిన విదేశీయుల రికార్డులను తనిఖీ చేస్తున్నప్పుడు ఈ ఉదంతం వెలుగు చూసింది. భాగల్పూర్కు చెందిన ఇద్దరు మహిళలు విదేశీ పౌరులుగా ఓటర్ల సవరణలో తేలారని అధికారులు నిర్ధారించారు. ఓటర్ల ధృవీకరణ నిర్వహించిన బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్)మాట్లాడుతూ మహిళలకు సరిపోయే పాస్పోర్ట్ వివరాలతో కూడిన అధికారిక సమాచారం అందిందన్నారు.
ఆ ఇద్దరు మహిళల పేర్లను తొలగించే ప్రక్రియను ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు. ఎస్ఐఆర్ ద్వారా బీహార్లో 65 లక్షల ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయని ఓ వైపు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తుంటే.. ఇప్పుడు ఇలా జరగడం అందర్నీ షాక్కు గురి చేస్తుంది.