18-12-2025 02:31:39 PM
రాష్ట్ర ఎన్నికల సంఘం అభినందన
కరింనగర్,(విజయక్రాంతి): మూడు దశల్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని విజయవంతంగా పూర్తిచేసిన మొదటి జిల్లాగా కరీంనగర్ నిలిచింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఎన్నికల సంఘం పేర్కొంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ జిల్లాలో మొత్తం మూడు దశల్లో అన్ని జిల్లాల కంటే ముందుగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసిన జిల్లాగా కరీంనగర్ నిలిచినందుకు గాను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో బాటు ఎన్నికల యంత్రాంగాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రశంసించింది.
జిల్లాలో ఈనెల 11,14,17 తేదీల్లో గ్రామపంచాయతీ ఎన్నికలకు పోలింగ్ జరిగింది. 11న గంగాధర, చొప్పదండి, రామడుగు, కరీంనగర్ రూరల్, కొత్తపల్లి మండలాలకు నిర్వహించిన పోలింగ్ 81.42 శాతం నమోదయింది. రెండో విడతలో ఈనెల 14న చిగురుమామిడి, గన్నేరువరం, శంకరపట్నం, తిమ్మాపూర్, మానకొండూర్ మండలాలకు పోలింగ్ నిర్వహించగా 86.58 శాతం పోలింగ్ నమోదయింది. మూడో విడతలో హుజురాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక, వి సైదాపూర్ మండలాలకు పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగగా 86.42% పోలింగ్ నమోదయింది.
పంచాయతీ ఎన్నికలను మూడు దశల్లోనూ విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన అధికారులు, పోలింగ్ సిబ్బందికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అభినందనలు తెలిపారు. సమర్థవంతంగా ఎన్నికల నిర్వహణకు కృషి చేసిన సాధారణ పరిశీలకులు వెంకటేశ్వర్లును, జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్ ను కలెక్టర్ అభినందించారు.