05-11-2025 12:42:09 AM
దుంపలకుంట మార్కెట్లో ఇష్టారాజ్యం
కొల్చారం, నవంబర్ 4 :కొల్చారం మండలంలోని దుంపలకుంట మార్కెట్లో గ్రామ పం చాయతీ మల్టీపర్పస్ వర్కర్లు తై బజార్ వసూళ్లలో చేతి వాటం ప్రదర్శిస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. గ్రామ పంచాయతీ పరిధిలోని దుంపలకుంట చౌరస్తాలో ప్రతి మంగళవారం వారాంతపు సంత జరుగుతుంది. ఈ సంతకు సంబంధించి గత మార్చి నెలలో తై బజార్ వేలం నిర్వహించగా గ్రామానికి చెందిన జోగయ్య 1,20,000 కు తైబజార్ ను దక్కించుకున్నాడు.
కాగా ఇప్పటివరకు గ్రామ పంచాయతీకి రూ.60 వేల రూపాయలు చెల్లించాడు. అయినప్పటికీ గత రెండు వారాల క్రితం ఒక గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్ తన సొంత ప్రయోజనాల కోసం పంచాయతీ కార్యదర్శితో కుమ్మక్కై తై బజార్ కాంట్రాక్టర్ జోగయ్యను తొలగించి పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లతో రెండు వారాలుగా తైబజార్ వసూలు చేస్తున్నారు. దీంతో సదరు మల్టీపర్పస్ వర్కర్ తన తోటి సిబ్బందితో కలిసి తై బజార్ వసూళ్లలో చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దుకాణదారుల నుండి సదరు వర్కర్ అందినకాడికి డబ్బులు వసూలు చేస్తూ రసీదులు ఇవ్వకుండా తన జేబు నింపుకుంటున్నారు. తై బజార్ వసూళ్లను పర్యవేక్షించాల్సిన పంచాయతీ కార్యదర్శి సిబ్బందికి రసీదు బుక్కులను అప్పగించి వెళ్ళింది. దీంతో మల్టీపర్పస్ వర్కర్ల ఆగడాలకు అంతులేకుండా పోయింది. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి సౌజన్య వివరణ కోరగా తాను విచారణ జరిపి చర్య తీసుకోనున్నట్లు తెలిపారు.