విత్తనాల కోసం క్యూలైన్లో పాసుపుస్తకాలు
వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో రైతులకు విత్తన కష్టాలు
సంగారెడ్డి, మే 21 (విజయక్రాంతి) : రైతులకు అవసరమైన జనుము, జీలుగ విత్తనాలు సకాలంలో అందకపోవడంతో వ్యవసాయ కేంద్రానికి ఒక్కసారిగా తరలివచ్చారు. మంగళవారం సంగారెడ్డి జిల్లాలోని జోగిపేట వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద రైతులు జనుము, జీలుగ విత్తనాల కోసం పాసు పుస్తకాలను క్యూలో పెట్టి వేచి ఉన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతుల అవసరాలకు అనుగుణంగా విత్తనాలు పంపిణీ చేయకపోవడంతోనే ఇలాంటి కష్టాలు ఎదుర్కోవడం జరుగుతుందని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల డిమాండ్కు అనుగుణంగా విత్తనాలు పంపిణీ చేయాలని కోరారు. వ్యవసాయశాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే విత్తనాలు సక్రమంగా పంపిణీ చేస్తాలేరనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా అధికారులు తగు చర్యలు తీసుకోని రైతులకు అవసరమైన విత్తనాలు పంపిణీ చేసేందుకు వ్యవసాయ కేంద్రాల్లో సిద్ధంగా ఉంచాలన్నారు.






