calender_icon.png 13 May, 2025 | 4:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల విజ్ఞప్తులను సత్వరమే పరిష్కరించాలి

13-05-2025 12:46:22 AM

 జిల్లా కలెక్టర్ హనుమంతరావు  

యాదాద్రి భువనగిరి, మే 12 (విజయక్రాంతి): ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను పెండింగ్లో లేకుండా తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ ఎం మన్మంతరావు వివిధ డిపార్ట్మెంట్ల అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్ డే సందర్భంగా సోమవారం నాడు కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులపై అధికారులతో కలెక్టర్ సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలు పరిష్కారం అయితే అదే సమస్యపై తిరిగి దరఖాస్తులు రాకూడదన్నారు. సంబంధిత అధికారులు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని కోరారు. కలెక్టర్ అందజేసిన దరఖాస్తులలో పలు రకాల సమస్యలు వెలుగులోకి వచ్చాయి.

గుండాల మండలం అంబాల గ్రామానికి చెందిన కందాల శాంతమ్మ దరఖాస్తు అందిస్తూ భర్త కృష్ణా రెడ్డి  మృతి చెందారని, వికలాంగురాలు అయినందున 4ఎకరాల 32 కుంటల భూమి తనకు తెలియకుండా ఇద్దరు కొడుకులు  వాళ్ళ పేర్లపై మార్చుకున్నారని, ఇల్లు కూడా విక్రయుంచుకున్నారని, తనను చూడడం లేదని తన భూమి తనకు ఇప్పించాలని కోరారు. 

భువనగిరి మండలం గౌస్ నగర్ కు చెందిన సి.హెచ్. మల్లారెడ్డి తన దరఖాస్తును అందిస్తూ సర్వే నెంబరు 144, 147లలో 17 ఎకరాల 26 గుంటల భూమి ఉందని ప్రక్కనే 148 సర్వేనెంబర్‌లోని పల్లెర్ల మైసయ్య, యాదమ్మ, జంగం వెంకమ్మ, కందుకూరి జయమ్మ, వెల్వెర్తి పోచమ్మ , నల్లెర్ల చంద్రయ్య లు తన భూమిని ఆక్రమిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

భువనగిరి మండలం ఎల్బీనగర్ కు చెందిన బాలమణి తన భర్త చనిపోయాడని రేషన్ కార్డులో తన కొడుకు పేరు చేర్చాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా హనుమపురం కు చెందిన ఎర్రబోయిన ఆండాలు భర్త పెద్ద నరసింహ పింఛన్ రావడంలేదని కూలి పనులపై ఆధారపడి జీవిస్తున్నామని దరఖాస్తు అందించారు.

మోత్కూరు మండలం పొడిచెడు గ్రామానికి చెందిన మార్పాక స్వామి తనకు వారసత్వంగా వచ్చిన ఎకరం పావు  భూమి ధరణిలో ఇతరుల పేరుపై నమోదయిందని తన పేరుపై చేయాలని విజ్ఞప్తి  చేశారు. అందులో రెవిన్యూ శాఖ , జిల్లా పంచాయతీ శాఖ , సర్వే ల్యాండ్స్ , హౌసింగ్ , ఆర్.టి.సి , లేబర్, విద్య శాఖ, ఇంటర్మీడియట్ , జిల్లా గ్రామీణాభివృద్ధి  శాఖలకు  దరఖాస్తులు  వచ్చాయని తెలియజేశారు.

రాజీవ్ యువ వికాస్  పథకం కింద 50 వేల నుండి నాలుగు లక్షల రూపాయల వరకు రుణాలు పొందేందుకు అవకాశం ఉన్నందున అర్హులైన లబ్ధిదారులకు రుణాలు మంజూరు అయ్యేలా బ్యాంక్ అధికారులను ఒప్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో  అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జడ్పీ సీఈఓ శోభా రాణి,  స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయశ్రీ,వివిధ శాఖల  జిల్లా అధికారులు పాల్గొన్నారు.