17-10-2025 11:44:17 PM
మణుగూరు,(విజయక్రాంతి): భద్రాద్రి పవర్ ప్లాంట్ లో నూరుశాతం పనులు ఆదివాసీలకే కేటాయించాలని, ఆదివాసి కాంట్రాక్టర్స్ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం బిటిపిఎస్ ప్రధాన ద్వారం ముందు మూడు గంటలకు పైగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రభావిత వీటీడీఏ ఆదివాసి సొసైటీలకు, ఆదివాసి గ్రామాల కాంట్రాక్ట్ ఫార్ములకు నిర్దిష్ట శాతం పనులు కేటాయించవలసినట్లు ఆదేశాలు ఉన్నప్పటికీ స్థానిక టీఎస్ జెన్కో అధికారులు స్థానిక రాజకీయ నాయకులు, నియమిత బిల్డర్లు అనుచరులకు పనులు అప్పగిస్తూ ఆదివాసీలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.
బాయిలర్ టర్బైన్, ఈఎస్పీ పంప్ హౌస్ సర్వీస్ బిల్డింగ్ మెయింటెనెన్స్ గార్డెన్ క్లీనింగ్, కోల్ క్లీనింగ్ మొదలైన అన్ స్కిల్డ్, సెమి స్కిల్ మెయింటెనెన్స్ పనులలో ఆదివాసి యువతకు ఉపాధి కల్పించడంలేదన్నారు. ఆదివాసి సొసైటీలకు పనులను కేటాయించాలని, పవర్ ప్లాంట్ లో టెండర్ ప్రక్రియలో అవినీతి, అక్రమాలపై తక్షణమే విచారణ జరిపి సంబంధిత కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొందరు అధికారులు ముడుపులు తీసుకొని గిరిజనేతరులకు పనులు కేటాయించడం మానుకోవాలన్నారు. ప్రభావిత గ్రామాల ఆదివాసులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.