calender_icon.png 7 June, 2025 | 9:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్తగా వచ్చినోళ్లకే పదవులు!

07-06-2025 12:00:00 AM

  1. సీనియర్ నాయకుల్లో తీవ్ర అసంతృప్తి
  2. ఏండ్లుగా పార్టీ కోసం కష్టపడినా దక్కని గుర్తింపు
  3. సీఎం రేవంత్‌రెడ్డికి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఫీడ్‌బ్యాక్
  4. ఎంపీ నియోజకవర్గాల్లో చేపట్టిన సమావేశాల గురించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మీనాక్షి నటరాజన్ వివరణ

హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షినటరాజన్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్‌లో ని ఆయన నివాసంలో సమావేశమై, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై దాదాపు గంటపాటు చర్చించారు. ప్రధానంగా మంత్రివర్గ విస్తరణ పీసీసీ కార్యవర్గంతో పాటు గత కొన్ని రోజులుగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న సమీక్షల్లో పార్టీ నాయకుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌పై సీఎం కు వివరించారు.

రాష్ట్రంలోని మెజార్టీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు బాగాలేకపో వటం, పార్టీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదనే అంశం చర్చకు వచ్చినట్టుగా సమాచారం. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షే మం, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమవుతున్నారంటూ అభిప్రా యం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అంతే కాకుండా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలు సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకోవడంలో చాలా వెనకబడి ఉన్నారనే అంశాన్ని ప్రస్తవించినట్టు సమాచారం.

పార్టీ కోసం ముప్పు, నలభై ఏళ్లుగా సేవ చేస్తున్న వారికి కాకుండా.. కాంగ్రెస్‌లో కొత్తగా చేరిన వారికే పదవులు ఇస్తున్నారనే విషయం తన దృష్టికి వచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డికి మీనాక్షి నటరాజన్ వివరించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం లేదని, వాటిని తొందరగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని, లేదంటే మరిన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదముందని సూచించారని తెలిసింది. పార్టీ పదవులు, నామినెటెడ్ పోస్టుల్లో పార్టీ కోసం కష్టపడిన వారికీ చోటు ఇవ్వాలనే చర్చ జరిగినట్టు సమాచారం.