25-09-2025 12:00:00 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): ఖమ్మం నగర ప్రజల వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం రూ.525.36 కోట్ల వ్యయంతో మున్నేరు వాగుకు రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని ప్రజా ప్రభుత్వం చేపట్టింది. ఖమ్మం నగరం మధ్య నుంచి ప్రవహిస్తున్న మున్నేరు వాగు ఏటా వర్షాకాలంలో ఉధృతంగా పొంగి, పరిసర ప్రాంతాల ఇండ్లు, వర్తక , వ్యాపార సంస్థలు, పంటలు వరద ముంపునకు గురవుతున్నాయి.
దీంతో వందలాది కుటుంబాలు సర్వస్వం కోల్పోయి, కట్టు బట్టలతో రోడ్డున పడుతున్నాయి. రోడ్లు, విద్యుత్ స్తంబాలు, సబ్ స్టేషన్లు, పాఠశాల భవనాలు, తాగునీటి వసతు లు, పైపు లైన్లు, ఆరోగ్య కేంద్రాలు దెబ్బతింటున్నవి. రూరల్ మండలంలో పంటలు ముంపునకు గురవుతాయి. 2024 సెప్టెంబర్లో సంభవించిన క్లౌడ్ బరస్ట్తో మున్నేరుకు వచ్చిన ఆకస్మిక వరద ముంపుతో రూ.757 కోట్ల నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు.
వరద ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్రెడ్డి పర్యటించి, బాధిత కుటుంబాలను పరామర్శించారు. మున్నేరు వాగు రిటైనింగ్ వాల్ పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మున్నేరు వాగుకు 5,863 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం నుండి గరిష్టంగా 10 వేల క్యుమెక్స్ వరద ప్రవహిస్తుంది. ఖమ్మం నగరం మద్య నుండి ప్రవహిస్తున్న మున్నేరు వాగుకు ఎడమ వైపు డ్రైనేజ్ వ్యవస్థ ద్వారా 379 క్యూమెక్స్ ,
కుడి వైపు డ్రైనేజ్ వ్యవస్థ ద్వారా 605 క్యూమెక్స్ వరద డిశ్చార్జ్ అవుతుంది. పరివాహక ప్రాంతం, నగరం నుంచి వచ్చే వరద గరిష్ట స్థాయిని దృష్టిలో ఉంచుకుని, మున్నేరు వాగు కు రెండు వైపుల సిమెంట్ కాంక్రీట్ రక్షణ గోడ పనులను ప్రభుత్వం మంజూరు చేసింది. శాశ్వత పరష్కారానికి ప్రజా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా రూ.525.36 కోట్ల వ్యయంతో మున్నేరు వాగుకు రెండు వైపు లా రిటైనింగ్ వాల్ నిర్మాణం పనులను 2024 మార్చి నెలలో ప్రారంభించారు.
మున్నేరు వాగుకు రెండు వైపుల ఖమ్మం రూరల్ మండలంలో 8.5 కిలోమీటర్లు, ఖమ్మం అర్బన్ మండలంలో 8.5 కిలోమీటర్లు మొత్తం 17 కిలోమీటర్లు పొడవున 10-15 మీటర్ల ఎత్తున రిటైనింగ్ వాల్తో పాటు, సర్వీసు రోడ్డు, డ్రైనేజ్ వ్యవస్థ సదుపాయంతో ప్రారంభించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. పనుల నాణ్యతకు ప్రభు త్వం ప్రాధాన్యత ఇస్తున్నది. వరంగల్ ఎన్ఐటీ నిపుణులతో పనుల ప్రమాణాలను తనిఖీ చేయిస్తున్నది.
పనులపై మంత్రుల పర్యవేక్షణ
రిటైనింగ్ వాల్ పనులను రెవెన్యూ, గృ హ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఖమ్మం అర్బ న్ మండలంలో మల్లేమడుగు, దానవాయి గూడెం, బుర్హాన్ పురం, ఖమ్మం గ్రామాలు, ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి, గొల్లపాడు, గుడిమల్ల, గుర్రాలపాడు, ఏదులా పురం గ్రామాలకు చెందిన మొత్తం 245.12 ఎకరాల భూసేకరణలో 106.21 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది.
138.31 ఎకరాల పట్టా భూమిలో ఇప్పటివరకు 69.12 ఎకరాలను సేకరించడం జరిగింది. భూ సేకరణ ప్రక్రియ వేగంగా జరుగుతున్నది. నిర్వాసితులకు పరిహారంతో పాటు, ఇండ్ల స్థలాలు కేటాయించుటకు ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి గ్రామంలో 139.27 ఎకరాల్లో లే-అవుట్ ను ప్రభుత్వం అభివృద్ది చేస్తున్నది. ఈ లే-అవుట్ నందు 1,666 కుటుంబాలకు ఇండ్ల స్థలాలు కేటాయించనున్నారు.