15-07-2025 12:25:08 AM
యూయూఎస్పీసీ ఉపాధ్యాయ సంఘం
కామారెడ్డి, జూలై 14 (విజయ క్రాంతి): ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలపై దశలవారీగా పోరాటం చేపట్టనున్నట్లు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ యుయస్ పి స్టీరింగ్ కమిటీ ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేసింది. సోమవారం టియస్యుటిఎఫ్ కార్యాలయంలో ఎం. సోమయ్య అధ్యక్షతన స్టీరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు గడిచినప్పటికి ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో తీవ్రమైన జాప్యాన్ని ప్రదర్శిస్తుందన్నారు.
మేనిఫెస్టోలో పొందుపరచిన ఎన్నికల హామీలను అమలు పరచడం లేదన్నారు. ఉపాధ్యాయుల ప్రమోషన్లు బదిలీల షెడ్యూల్ను తక్షణమే విడుదల చేసి, ఈనెలాఖరులోగా ప్రక్రియను పూర్తి చేయాలని యుయస్పిసి డిమాండ్ చేసింది. నూతన జిల్లాలకు డిఈఓ పోస్టులను, ప్రతి రెవెన్యూ డివిజన్కు డిప్యూటీ ఈఓ, నూతన మండలాలకు యంఈఓ పోస్టులను మంజూరు చేసి, ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్ను రూపొందించి, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయలన్నారు.
ఉపాధ్యాయుల పెన్షనర్ల, వివిధ రకాల బిల్లులను వెంటనే విడుదల చేయాలి. ప్రాథమిక పాఠశాలలకు 5,571 పియస్ హెచ్యం పోస్టులను మంజూరు చేయాలని, డిఎడ్, బిఎడ్ అర్హతలున్నప్రతి యస్జిటికి పియస్హెచ్యం ప్రమోషన్కు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. పండిట్, పిఈటిల అప్ గ్రేడేషన్ ప్రక్రియ పూర్తి అయినందున జిఒ 2,3,9,10 లను రద్దు చేసి జిఒ 11,12 ల ప్రకారం పదోన్నతులు కల్పించాలని, ఉపాధ్యాయుల సర్దుబాటు మార్గదర్శకాలను సవరించాలని,
వివిధ జిల్లాల్లో జరిగిన పైరవీ డిప్యూటేషన్లను వెంటనే రద్దు చేయాలని, గురుకుల టైం టేబుల్ సవరించాలని, కెజిబివి, మోడల్ స్కూల్స్ టీచర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈనెల జులై 23, 24 తేదీలలో మండల తహసీల్దార్ల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి కి మెమోరాండాలు,ఆగస్టు ఒకటిన జిల్లా కేంద్రాల్లో ధర్నాలు,ఆగస్టు 23న హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి మహాధర్నా నిర్వహిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో యుయస్పిసి స్టీరింగ్ కమిటీ సభ్యులు చావ రవి, ఎ. వెంకట్, చకినాల అనిల్కుమార్, నన్నెబోయిన తిరుపతి, టి. లింగారెడ్డి, యస్. హరికిషన్, బి. కొండయ్య, యం. సైదులు, డి. రాజయ్య లు పాల్గొన్నారు.